మాంసాహార ప్రియులకు మటన్ అంటే మక్కువ ఎక్కువ. మటన్ లో మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తుంది. సాధారణంగా మటన్ ను బిర్యాని , కర్రీ లేదా ఫ్రై చేసుకుని తింటుంటారు.. కాస్త డిఫరెంట్గా గోంగూర మటన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది.. ఈ డిష్ మన అమ్మమ్మల కాలంలో ఎక్కువగా చేసేవారు.. ఇంతకీ గోంగూర మటన్ ఎలా తయారు చేసుకోవాలి.. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
గోంగూర మటన్ తయారీకి కావలసిన పదార్థాలు..
మటన్ అరకిలో, గోంగూర మూడు కట్టలు, పచ్చిమిర్చి ఆరు, పసుపు ఒక చెంచా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, గరం మసాలా ఒక చెంచా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, నూనె ఒక చెంచా, కారం రెండు చెంచాలు, ధనియాల పొడి ఒక చెంచా, జీలకర్ర పొడి అర చెంచా, ఉప్పు కొద్దిగా..
ముందుగా మటన్ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో మటన్, జీలకర్ర పొడి, ధనియాలపొడి, కారం, కొద్దిగా ఉప్పు అన్నింటినీ వేసి కలిపి పెట్టుకోవాలి. కుక్కర్లో నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకొని అందులో నూనె పోసి వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి, గరం మసాలా వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. గోంగూరను కాస్త సన్నగా తరిగి ఉల్లిపాయల మిశ్రమంలో వేసి ఉడికించుకోవాలి. గోంగూర మెత్తగా ఉడికిన తర్వాత అందులో.. ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ తగినంత ఉప్పు వేసి మరో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోంగూర మటన్ తినటానికి రెడీ. ఈ కూర బిర్యాని, చపాతి, పుల్కా, అన్నం లోకి తినటానికి భలే రుచిగా ఉంటుంది..