ఈ కాలంలో క్యారెట్స్ బాగా దొరుకుతాయి.అలాగే దుంపల్లో ఒకటి అయిన క్యారెట్ ను పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎందుకంటే క్యారెట్ తినడానికి ఎంతో తియ్యగా ఉంటుంది. కనుక దీన్ని పచ్చిగా కూడా తింటుంటారు. అయితే క్యారెట్ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరచడంతోపాటు శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే క్యారెట్ జ్యూస్ తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. క్యారెట్ జ్యూస్ను రెండు రోజులకు ఒకసారి అయినా తాగుతూ ఉంటే ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాము. మరి ఈ క్యారట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తయారీకి కావల్సిన పదార్థాలు:
క్యారెట్ ముక్కలు – రెండు కప్పులు
పంచదార – అర కప్పు
నీళ్లు – 4 కప్పులు
నిమ్మ రసం – 3 టీ స్పూన్స్
అల్లం ముక్క – ఒక ఇంచు ముక్క
ముందుగా క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ఒక జార్ లో గాని లేదంటే బ్లెండర్ లో గాని వేయాలి. అలాగే క్యారెట్ ముక్కలతో పాటుగా పంచదారను వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత 2 కప్పుల నీళ్లును పోసి 3 నిమిషాల పాటు మరలా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వస్త్రం సహాయంతో వడకట్టుకుని అందులో నిమ్మ రసాన్ని వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన క్యారెట్ జ్యూస్ రెడీ అయినట్లే.
క్యారెట్ జ్యూస్ తాగడం వలన ప్రయోజనాలు :
క్యారెట్ జ్యూస్ నిత్యం తాగడం వలన శరీరంలోని మృత కణాలు చనిపోతాయి.చర్మం మంచి రంగులోకి మారుతుంది.చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది రోజు క్యారెట్ జ్యూస్ తాగడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది.