మనదేశంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు కోటి పైనే ఉన్నాయని చెప్పవచ్చు. కరోనా కేసులు విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవటం వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా కరోనా బారిన పడిన వారు ఎక్కువశాతం ఆ వైరస్ నుంచి కోలుకుని బయటపడ్డారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువ అని చెప్పవచ్చు. అయితే ఒకసారి కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చిన తర్వాత మరి ఎన్ని రోజులకు ఆ వ్యక్తి లో వైరస్ వ్యాపించదు అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే వారి సందేహాలను తీరుస్తూ తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మొనాష్ యూనివర్సిటీ నిపుణులు శుభవార్తను తెలియజేశారు.
మొదటసారి కరోనా మహమ్మారి బారిన పడి ఎవరైతే సురక్షితంగా కోలుకొని ఉంటారో అలాంటి వారికి మరో ఎనిమిది నెలల పాటు కరోనా వైరస్ వ్యాపించదనే శుభవార్తను మొనాష్ యూనివర్శిటీ నిపుణులు తెలియజేశారు. అంతేకాకుండా కరోనా నుంచి కోలుకున్న వారికి టీకా వేయించుకునే అవకాశం దొరికితే అలాంటివారిలో ఇప్పుడే కరోనా రాదని తెలియజేశారు. వీటితో పాటు ఈ అధ్యయనంలో మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు.
ఈ పరిశోధనలో భాగంగా దాదాపు 25 మంది కరోనా సోకిన వారిని వ్యాధి బారిన పడిన నాలుగు రోజుల నుంచి దాదాపు 200 రోజుల వరకు వారిపై ఆస్గ్రేలియా దేశంలోని మొనాష్ యూనివర్సిటీకి నిపుణుల పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో భాగంగా కోవిద్-19 బారిన పడ్డవారిలో ఇమ్యూనిటీ వ్యవస్థకు చెందిన మెమొరీ బీ-సెల్స్ ను పరిశోధకులు గుర్తించారు.మెమొరీ బీ-సెల్స్ కరోనా వైరస్, కణాలను ఎక్కువ రోజుల పాటు గుర్తుంచుకుంటాయి. ఒకవేళ కరోనా వైరస్ మళ్లీ సోకితే ఈ కణాలు రోగనిరోధక శక్తిని మెరుగు పరిచే ఆ వైరస్ పై దాడి చేసే యాంటీబాడీలను వేగంగా ఉత్పత్తి చేస్తాయని మెమో వాన్ జెల్మ్ అనే శాస్త్రవేత్త తెలియజేశారు. అంతేకాకుండా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు సుమారు ఎనిమిది నెలలపాటు కరోనా వైరస్ తో సమర్థవంతంగా పోరాడగలవని ఈయన వివరించారు.