కరోనా వైరస్ దేశంలో రోజురోజుకీ ఉదృతంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఊహించని రీతిలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో రోజు నమోదు కావడంతో కేంద్రంలోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాల లోనూ టెన్షన్ పెరుగుతూనే ఉంది. మరో సారి లాక్ డౌన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఆర్థికంగా దేశం గొప్ప కూలిపోయే పరిస్థితి ఉండటంతో….ఆ దిశగా కాకుండా యధావిధిగా కరోనా నిబంధనలు ప్రజలు పాటించేలా మరోపక్క యధావిధిగా పనులు చేసుకునే విధంగా కేంద్రం మరియు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.
కాగా వైద్య సదుపాయం కరోనా రోగులకు చికిత్స కష్టం గా మారుతున్న తరుణంలో .. ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా ట్రీట్ మెంట్ విషయంలో ప్రభుత్వము అనుమతులు ఇవ్వడం జరిగింది. దీంతో అనుమతులు రావడంతోనే హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేట్ మరియు ప్రైవేటు ఆసుపత్రులు కరోనా బారిన పడినవారికి ట్రీట్మెంట్ ఖర్చుల విషయంలో లక్షల మీద లక్షలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి తో చాలా మంది సామాన్యులు కరోనా చికిత్స కి డబ్బులు కట్టుకోలేక ఆస్తులు, ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి చాలా చోట్ల ఏర్పడింది.
పరిస్థితి ఇలా ఉండగా హైదరాబాద్ లో కరోనా ట్రీట్మెంట్ కేవలం 28 వేల రూపాయలకు జైన్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా చికిత్స విషయంలో హైదరాబాద్ వాసులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ నాణ్యమైన చికిత్స ఇవ్వలేని సమయంలో అతి తక్కువ ఫీజులతో ఈ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ దాతల సహాయ సహకారాలతో కరోనా బారిన పడిన వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకి ఇప్పటికే 15 కరోనా సెంటర్లు ఉన్నాయి. తాజాగా 16వ కోవిడ్ సెంటర్ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసింది జైన్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ. హైదరాబాద్ నగరంలో బేగంపేటలోని మానస సరోవర్ లో వంద పడకలతో అన్ని రకాల నాణ్యమైన సదుపాయాలతో ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చారు.
ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనల మేరకు ఆసుపత్రిలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అతి తక్కువ ఫీజు లోనే నాణ్యమైన కరోనా చికిత్స అందించడానికి ముందుకు వచ్చారు. ఇక హాస్పిటల్లో సదుపాయాలు విషయానికి వస్తే ఒక గదిలో ఇద్దరు చొప్పున ఉంటే వారం రోజులకు ఒక్కొక్కరు 28 వేల రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఒక్కరే ఉండాలనుకుంటే వారం రోజులకు 35 వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని…. కరోనా నివారణకు అవసరమైన మందులు చికిత్స ఆక్సిజన్ అన్నీ అందిస్తున్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఇక ఆహారం విషయంలో పోషకాలతో కూడిన శాకాహారం మాత్రమే కరోనా రోగులకు అందిస్తున్నట్లు జైన్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ చెప్పుకొచ్చింది. హాస్పిటల్లో ఆరుగురు వైద్యులు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటారని… అత్యవసర పరిస్థితి వస్తే ఆంబులెన్స్ సదుపాయం కూడా ఉందని జైన్ ఇంటర్నేషనల్ ప్రతినిధి వినోద్ రాంకా తెలిపారు.