అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు.కారణం ఏమంటే ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసేంత వరకూ అధిక రక్తపోటు వచ్చిందన్న విషయం కూడా తెలియదు. అయితే చాలామందిలో ఉన్న భావన ఏమంటే రక్తపోటు వస్తే దానితో పాటు కొన్ని లక్షణాలు కనబడతాయనీ, అలాంటి లక్షణాలు కనబడేవరకూ ఆలోచించనక్కర లేదనీ. ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు.
రక్తపోటు ఉంటే తలనొప్పి, చమట్లు పోయడం, తల తిరగడం, ముఖం ఎర్రబడడం, ముక్కు వెంట రక్తం కారడం వంటి లక్షణాలు కనబడతాయని చాలామంది భావిస్తారు. అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆ భావన తప్పు అని అంటోంది.
నిజానికి రక్తపోటు 180/120 కన్నా ఎక్కువ స్థాయికి పెరిగినపుడు కొన్ని లక్షణాలు కనబడతాయి. అయితే రక్తపోటు అక్కడి వరకూ వెళ్లింది అంటే దానిని వైద్యులు చాలా తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంగా పరిగణిస్తారు. అలాంటి సంక్షోభం తలెత్తినపుడు, తీవ్రమైన తలనొప్పి, ముక్కు వెంట రక్తం కారడం, ఛాతి నొప్పి, వెన్ను నొప్పి, మానసిక ఆందోళన, ఊపిరి ఆడక పోవడం వంటి లక్షణాలు కనబడతాయి.
అధిక రక్తపోటు కారణంగా పైకి కనబడని మార్పులు కొన్ని శరీరంలో చోటు చేసుకుంటాయి. వాటి విపరిణామాలు ప్రస్ఫుటమవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అధిక రక్తపోటు వల్ల వచ్చే విపరిణామాలు: లైంగిక పటుత్వం తగ్గిపోవడం. రక్తనాళాలు కుంచించుకు పోవడం, గుండెపోటు. చూపు తగ్గిపోవడం. మూత్రపిండాల వ్యాధి. రక్త నాళాలకు సంబంధించిన ఇంకా కొన్ని వ్యాధులు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.
అధిక రక్తపోటును గుర్తించడానికి ఉన్న ఒకే ఒక మార్గం క్రమం తప్పకుండా వైద్యుడి దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం. మహిళలకు గర్భం వచ్చిన సమయంలో అధిక రక్తపోటు కనబడవచ్చు. అటువంటప్పుడు తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు కావడం, పొట్టలో నొప్పి, బరువు పెరగడం వంటి లక్షణాలు కనబడతాయి. ఈ రక్తపోటుకు వైద్యుడి సహాయంతో చికిత్స తీసుకోవాలి. లేని పక్షంలో తల్లికి, శిశువుకూ కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.