ప్రఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్ ప్రపంచ జనాభాకు ఆదర్శ డైట్ ప్లాన్ ప్రకటించింది. దీని ప్రకారం చక్కెర, రెడ్ మీట్ (బీఫ్, మేక గొర్రె మాంసం, పోర్క్) 50 శాతం తగ్గించాలి. రుచులు తగ్గినా, ఆయుష్షు పెంచే ఆదర్శ ఆహారం ఇదేనని లాన్సెట్ చెబుతోంది.
లాన్సెట్ ఆధ్వర్యంలో పనిచేసిన ఒక కమిషన్ గురువారం తమ నివేదిక విడుదల చేసింది. 16 దేశాలకు చెందిన 19 మంది శాస్త్రవేత్తలు, 18 మంది నిపుణులు ఈ కమిషన్లో ఉన్నారు. ప్రజల ఆరోగ్యానికే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో కమిషన్ ఈ డైట్ ప్లాన్ రూపొందించింది.
పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన శ్రీనాథ్ రెడ్డి, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరాన్మెంట్కు చెందిన సునీతా నారాయణ్ ఇండియా నుంచి ఈ కమిషన్లో సభ్యులుగా ఉన్నారు.
ఆరోగ్యవంతుడైన సగటు మనిషికి రోజుకు 2500 క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారం అవసరం. ఇందులో 800 క్యాలరీలు ధాన్యాల నుంచీ, 204 క్యాలరీలు పళ్లు, కూరగాయల నుంచీ పొందాలని డైట్ ప్లాన్ చెబుతోంది. రెడ్ మీట్ నుంచి పోందే క్యాలరీలు 30 కి మించకూడదు.
చక్కెర గానీ కొవ్వుగానీ విడిగా కలిపి తయారుచేసే పదార్ధాలకు ఆదర్శ ఆహారంలో చోటు ఉండరాదని డైట్ ప్లాన్ నిర్దేశిస్తున్నది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ప్రపంచవ్యాప్తంగా రోగాలకు దారి తీస్తున్న కారణాలలో ప్రధానమైనది. ఈ డైట్ ప్లాన్ పాటించడం వల్ల ఏటా కోటీ పది లక్షల అకాల మరణాలను నివారించవచ్చని లాన్సెట్ తెలిపింది.
ఆరోగ్యకరమైన ఆహారం
ఆహారం గ్రాములు క్యాలరీలు
ధాన్యాలు 232 811
కూరగాయలు 50 78
దుంపలు 50 39
పళ్లు 200 126
రెడ్ మీట్ 14 30
చికెన్ 29 62
చేప 28 40
కాయ ధాన్యాలు 75 284
చక్కెరలు 31 120