సాధారణ పండ్లతో పోల్చితే లిచీలు చాలా భిన్నమైనవి. వీటితో కలిగే ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఆ నష్టాలు ఏంటో తెలుసుకుందాం. లిచీలు పరగడుపున అస్సలు తినొద్దు. పచ్చిగా ఉండే లిచీ పండ్లు అస్సలు తినవద్దు. కొంతమంది వ్యాపారులు పచ్చి లిచీ పండ్లకు ఎర్ర రంగు వేసి అమ్మేస్తున్నారు. వాటిని తింటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
రాత్రులు నిద్రపోయే ముందు, ఉదయం ఖాళీ కడుపున లిచీ పండ్లను తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు వీటిని దూరంగా ఉంచడం చాలా మంచిదని చెబుతున్నారు. వెల్లూరు కు చెందిన పిల్లల వైద్య నిపుణుడు, ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ టి.జాకబ్ జాన్ బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పత్రిక ‘కరంట్ సైన్స్’లో లిచీ పండ్లు శరీరంపై చూపే దుష్పరిణామాల గురించి చెప్పారు.
2013లో జరిపిన పరిశోధనల్లో లిచీ పండ్ల గింజలు విషతుల్యమైనవని తేలిందని, వాటిని తినడం వల్ల శరీరంలో హైపోగ్లైసెమిక్ ఏర్పడి సుగర్ స్థాయిలు పడిపోతాయని తెలిపారు. లిచీలు పండినవైనా, పచ్చివైనా ప్రమాదకరమేనని, వీటిని అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. మొదటి సారి లిచీ పండ్లను తినే వారు తక్కువ మోతాదులో తినాలి. ఒకవేళ దురదగా అనిపిస్తే తినకూడదు. లిచీ వల్ల ఎలర్జీ సమస్యలతో బాధపడిన వారు చాలా మందే ఉన్నారు.
అధికంగా ఈ పండ్లను తినడం వలన మూత్రపిండ సంబంధిత వ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడు సంవత్సరాల లోపు పిల్లలు లిచీ పండ్లను తినకుండా ఉంటే మంచిది. పరగడుపున లిచీ పండ్లు తినడం వల్ల హైపోగ్లైసీమిక్ ఎన్సెఫాలోపతీ అనే నరాల సంబంధిత వ్యాధి సోకి ఫిట్స్ వచ్చి చనిపోయిన పిల్లలు చాలమందే ఉన్నారు.
గర్భిణీ స్త్రీలు ఈ పండు కి దూరం గా ఉండడమే మంచిది. ఎందుకంటే ఈ పండులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. మధుమేహ వ్యాధి గ్రస్తులైతే ఈ పండు జోలికే పోవద్దు. ఇందులో ఉన్న అధికశాతం చక్కెర మీ ప్రాణాల మీదకు తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.