ప్రపంచ దేశాల్లో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల మాస్కులు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే మాస్క్ తప్పక ధరించాలి. మాస్క్ లేకుండా అడుగు పెడితే మాత్రం కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీంతో మార్కెట్లో కొత్త కొత్త మాస్కులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రజలు కూడా మాస్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వైరస్ బారిన పడకుండా ఉండటానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి ఉండటంతో మాస్క్ ను విరివిగా వినియోగిస్తున్నారు. అయితే మాస్కులు ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి ప్రమాదమంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు మాస్క్ వాడాలో వద్దో అనే దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ మియామీ మాస్కుల గురించి అన్ని రకాల పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
మాస్కులను ఎక్కువగా వాడినంత మాత్రాన ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని శాస్త్రవేత్తలు సూచనలు చెబుతున్నారు. అయితే సీఓపీడీ లాంటి వ్యాధులతో బాధ పడుతుంటే మాత్రం మాస్కుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. వైద్యుల సూచనల మేరకు మాస్కులను వినియోగించాలని వెల్లడిస్తున్నారు.
ఈ అధ్యయనంలో పాల్గొన్న వాళ్లలో ఒకరైన మైఖేల్ కాంపోస్ మాట్లాడుతూ మాస్క్ ధరించడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడే వారికి ఇబ్బందులు ఎదురు కావచ్చని వెల్లడించారు. మాస్క్ లను బిగుతుగా ధరించవద్దని వీలైతే సర్జికల్ మాస్క్ లేదా రెండు పొరల మాస్క్ ధరించాలని సూచనలు చేశారు. మాస్కులు ధరించడం వల్ల ఆరోగ్య సమస్యలు రావని వెల్లడించారు.