శానిటైజర్తో ఎంత ప్రయోజనం వుందో.. అంతే నష్టం కూడా ఉందంటున్నారు నిపుణులు…. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వీటి వాడకం మరింత ఎక్కువైంది.
శానిటైజర్తో ఎంత ప్రయోజనం ఉందో అంతే నష్టం కూడా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా గృహిణులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే శానిటైజర్లలో 90 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. అదే క్రిముల్ని సంహరిస్తుంది. ఈ మిశ్రమానికి తక్కువ వేడిలో కూడా మండే స్వభావం ఉంటుంది. కాబట్టి శానిటైజర్ని చేతికి రాసుకున్న వెంటనే వంట గదిలోకి వెళ్లి గ్యాస్ స్టవ్ వెలిగిస్తే నిప్పు అంటుకునే ప్రమాదం పొంచి ఉంది.
అందువల్ల గృహిణులు చేతికి శానిటైజర్ రాసుకుని అది ఆరిన తర్వాతే వంట చేసే పనులు చేయడం మేలు. అలాగే పదేళ్ల లోపు పిల్లలు వినియోగించే సమయంలో తగిన జా గ్రత్తలు తీసుకోవాలి. ఐదేళ్ల లోపు వారికి చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. చేతుల్లో వేసుకుని రుద్దుకున్న తర్వాత ఒక నిమిషంలో అది ఆవిరవ్వాలి. అలా కాకుండా చేతులకు అంటుకుని ఉంటే చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయి.
జిగురు, నురుగు మాదిరి కంటే ద్రావణంగా ఉండే శానిటైజర్లే మంచిది.శానిటైజర్లతో 60-90 శాతం ఆల్కహాల్ ఉండాలి. అంతకంటే తగ్గినా, ఎక్కువగా ఉన్నా ఆశించిన ఫలితం రాకపోగా కొత్త సమస్యలు వస్తాయి. కనీసం 20-30 సెకన్ల పాటు చేతులకు రుద్దుకోవాలి. శానిటైజర్ల వాడకంపై విస్తృతంగా ప్రచారం జరగడంతో పలు నాసిరకం శానిటైజర్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటి గాఢత ఎక్కువ ఉండటంతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. శానిటైజర్ల ధరలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. సబ్బు అయితే తక్కువ ధరలో లభ్యమవుతుంది. చేతులు పూర్తిస్థాయిలో శుభ్రమవుతాయి. వైద్యులు సైతం సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు.