పతివ్రత.. అంటే పతియే దైవంగా భావించే భార్య. అంటే భర్త తప్ప పర పురుషులను ఎరుగని భార్య. సాధారణంగా భర్త అంటే ఒక్కరే ఉంటారు కాబట్టి ఒక్క పురుషునితోనే సంసార బంధం ఉన్న స్త్రీని పతివ్రత అంటారు. అయితే మహాభారతంలోని పాండవుల ఉమ్మడి భార్య ద్రౌపది కూడా పతివ్రతే అని చెబుతారు. ద్రౌపది తన ఐదుగురి భర్తలతో కాపురం చేసేటప్పుడు చాలా నియమాలు పాటించేది. ఆమె భర్త దగ్గర నుంచి మరో భర్త దగ్గరకు వెళ్లేటప్పుడు అగ్నిలో నడిచేది. దీనివల్ల ఆమె కన్నెతనం అలాగే ఉండేది. అగ్నిలో నడవడం వల్ల ఆమె మళ్లీ పవిత్రతను పొంది కన్నెగా మారేది.
మరి ఐదుగురు భర్తలు ఉన్న ద్రౌపది పతివ్రతా ఎలా అయిందన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే.. ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు. అతని భార్య శచీదేవి ద్రౌపదిగా జన్మించింది. అంటే పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాడు.పాండవులు ,ద్రౌపది… నవమాసాలు మాతృ గర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు. వీరందరూ అయోనిజులే.ద్రౌపది తల్లి గర్భాశయం నుంచి జన్మించలేదు. ఈమె అగ్ని నుంచి పుట్టింది. అది కూడా శిశువుగా పుట్టలేదు. యుక్తవయస్సుతో పుట్టింది. ఈమె పాంచాల రాజు అయిన ద్రుపదుడుకి అగ్ని ద్వారా జన్మించింది. అందువల్లే ఈమెను యగ్న సేని అంటారు.ద్రౌపది యఙ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణజన్మురాలు. ద్రౌపదికి చాలా పేర్లు ఉన్నాయి. ద్రౌపదికి పాంచాలి, యగ్నసేని, మహాభారతి, సైరాంధ్రి అనే పేర్లు ఉన్నాయి.
పాంచాల రాజ్యానికి రాణి కావడం వల్ల పాంచాలి అనే పేరు, అగ్ని దేవుడి ద్వారా జన్మించడం వల్ల యగ్నసేని అనే పేరు, ఐదుగురికి భార్య అవడం వల్ల మహాభారతి అనేపేర్లు వచ్చాయి. మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడిని ద్రౌపది వరించింది. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా పాండవులు ఐదుగురికి భార్యగా మారాల్సి వచ్చింది. అతిబల పరాక్రమవంతులైన ఐదుగురు భర్తలను వివాహమాడినా ఆమెకు ఆశించిన ప్రేమ దక్కలేదు. ద్రౌపది శ్రీకృష్ణ భగవానుడి కి ప్రియా సోదరిగా ఉండేది . పాండవులకు, ద్రౌపదికి కలిగిన సంతానమే ఉప పాండవులు. ధర్మరాజు కు ద్రౌపది కి ప్రతివింధ్యుడు, భీమునికు శ్రుతసోముడు, అర్జునునకు శ్రుత కీర్తి, నకులునకు శతానీకుడు, సహదేవునకు శ్రుత సేనుడు కలిగారు.
కురుసభలో దుశ్శాసనుడు, అడవిలో సైంధవుడు, విరాటుని కొలువులో కీచకుడు ఇలా ఎంత మందితో అవమానింప బడుతుంది. భీముని సహాయంతో అతన్ని అంతమొందిస్తుంది. దురహంకార రాజులను నాశనం చేయడానికే ఆమె ఈ అవతరాం ఎత్తింది. త్వష్ట్రప్రజాపతి కుమారుడైన ‘త్రిశిరుని ’ ఇంద్రుడు సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలోకాధిపత్యార్హతను కోల్పోయాడు. ఇంద్రుడు బ్రహ్మహత్యపాతక నివారణకై తపస్సు చేస్తున్న కాలంలో, అతని భార్య శచీదేవి, అసురుల ఆగడాలకు భయపడి, తన భర్తతిరిగి వచ్చేవరకు తనకు ఆశ్రయం ఇమ్మని అగ్నిదేవుని అర్థించి ఆయన నీడలో కాలం గడుపుతోంది. తన భర్త అయిన మహేంద్రుడు ఐదురూపాలతో భూలోకంలో జన్మించాడు అని తెలుసుకున్న శచీదేవి,యఙ్ఞ కుండం నుంచి ద్రౌపతిగా జన్మించి, పంచపాండవులకు అర్థాంగి అయింది. భౌతికంగా పాండవులు ఐదుగురుగా కనిపిస్తున్నా.. నిజానికి వారందరూ కలిసి ఒక్కరే. ఒక్కరితో అంటే ఒకే భర్త అయిన ఇంద్రునితో, ధర్మబద్ధమైన సంసారయాత్ర సాగించిన ‘ద్రౌపది ’ అంటే శచీదేవి పతివ్రతే కదా మరి.