కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇదివరకటి కంటే అధికంగా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. ఏ రోగాల బారినపడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆహార నియమాల్లోనూ అనేక మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని (ఇమ్యూనిటి) పెంచే ఆహారాన్ని తీసుకోడంలో ప్రాధాన్యత కనబరుస్తున్నారు. అయితే, రోగ నిరోధక శక్తిని పెంచడంలో మొలకలు, మొలకెత్తిన గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. మరీ మొలకలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం !
మొలకలలో అధిక పోషక విలువ కారణంగా వాటిని అద్భుత ఆహారంగా భావిస్తారు. మొలకలు రక్త శుద్దీకరణకు తోడ్పడతాయి. అనేక వ్యాధుల బారి నుండి రక్షణ కల్పించడానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. పెసలు, శెనగలు, వంటి విత్తనాలను రాత్రి నానబెట్టి ఉదయం వరకూ మూట కట్టి ఉంచాలి. రెండో రోజు తెరిచి చూస్తే మొలకలు వస్తాయి. ఇలా మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్- సి, విటమిన్- కె సరిపడినన్ని ఉంటాయి. మన బాడీకి చాలా అవసరం అయిన యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్స్ ఉంటాయి.
వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రొత్సహిస్తుంది. జుట్టుకు కలిగే అనేక రకాల సమస్యలు దరిచేరవు. అలాగే, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మొలకలలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీంతో విటమిన్ ఏ లోపం వల్ల కలిగే అనేక రోగాలు దరిచేరకుండా ఉంటాయి. వీటిల్లో శరీరానికి అవసరమైన సూక్ష్మ ములకాలైన ఐరన్, జింక్లు సహా క్యాల్షియం కూడా అధికంగా ఉంటుంది.
మొలకలు డయాబెటీస్ రోగులలో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగిన విధంగా ఉండేందుకు కొద్దిమేర సహాయపడతాయి. మొలకలను రెగ్యులర్గా తీసుకోవడంతో మెదడుకు రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. విటమిన్ సీ అధికంగా ఉండటంతో తెల్లరక్త కణాలను ఎప్పూడు యాక్టివ్గా ఉంచడంలో మొలకలు కీలక పాత్ర పోషిస్తాయి. కంటి చూపుకూడా మెరుగవుతుంది. అలాగే, చర్మ కణాలు ఉత్తేజితం అయి చర్మం తేజోవంతంగా అవుతుంది. వృద్ధాప్య లక్షణాలను త్వరగా రాకుండా అడ్డుకోవడంతో మొలకలు మంచి ప్రభావం చూపుతాయి.