కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అత్యంత ఆవశ్యకం అయింది. ఇందులో భాగంగానే చాలా మంది నిత్యం విటమిన్ ట్యాబ్లెట్లను వేసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, ఇంటి చిట్కాలను పాటించడం చేస్తున్నారు. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి లభిస్తుంది. కరోనా వచ్చినా దాని తీవ్రతను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎవరికైనా సరే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఓకే. కానీ ఆ శక్తి లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని పసిగట్టడం ద్వారా జాగ్రత్తపడి ఆ శక్తిని పెంచుకోవచ్చు.
1. శరీర రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతి క్షణం తీవ్రమైన స్ట్రెస్ ఫీలవుతుంటారు. మనస్సు రిలాక్స్గా ఉండదు. ఈ సమస్య ఉంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని గుర్తించాలి. వెంటనే ఒత్తిడి నుంచి బయట పడడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
2. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి తరచూ జలుబు చేస్తుంటుంది. దగ్గు, జ్వరం వస్తుంటాయి. ఈ లక్షణాలు ఉంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని గ్రహించాలి. అందుకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలి.
3. డయేరియా, మలబద్దకం సమస్యలు తరచూ బాధిస్తున్నా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని తెలుసుకుని అందుకు అనుగుణంగా సూచనలు పాటించాలి. వాటి నుంచి బయట పడితే ఆ శక్తి పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
4. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో గాయాలు మానేందుకు చాలా సమయం పడుతుంది. అందువల్ల అలాంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమస్య నుంచి బయట పడే ప్రయత్నం చేయాలి.
5. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని గుర్తించాలి. డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెరిగేలా చూసుకోవాలి.
6. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎప్పుడూ శక్తి లేనట్లుగా, నిస్సత్తువగా, నీరసంగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. ఆయా సమస్యల నుంచి బయట పడే యత్నం చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* రోగ నిరోధక శక్తి పెరగాలంటే నిత్యం పోషకాహారాన్ని సరైన సమయానికి తీసుకోవాలి.
* రోజూ ఒకే సమయంలో భోజనం చేయాలి.
* రోజుకు సరిపడా నీటిని తాగాలి. నిద్రపోవాలి.
* నిత్యం వ్యాయామం చేయాలి.
* వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి.
* బరువు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.
* మద్యం సేవించరాదు, పొగ తాగరాదు.
* ఒత్తిడిని తగ్గించుకునే యత్నం చేయాలి. మనస్సును రిలాక్స్ గా ఉంచుకోవాలి.