మధుమేహం అనేది ఇవాళ సాధారణం అయిపోయింది. నేటి జీవనవిధానం ఎక్కువమందిలో మధుమేహానికి దారి తీస్తున్నది. ఇది నిజానికి జబ్బు కాదు. ఒక శారీరక స్థితి. ఆ స్థితిలో రక్తంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ చక్కెర శాతం ఉంటుంది. ఈ స్థితి వల్ల ఇతర జబ్బులు రావచ్చు. నేత్రాలు దెబ్బతినవచ్చు. గుండె జబ్బు రావచ్చు. మూత్రపిండాలు పాడుకావచ్చు.
మధుమేహం వల్ల వక్షోజాల (బ్రెస్ట్) కాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఉందని ఇప్పుడు పరిశోధకులు అంటున్నారు. అమెరికా, ఇథాకాలో ఉన్న కార్నెల్లీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మధుమేహానికీ, మెటాస్టాటిక్ (మొదట వచ్చిన చోటికి దూరంగా శరీరంలో ఇంకోచోటకు వ్యాపించే రకం) కాన్సర్కూ మధ్య సంబంధం ఏమన్నా ఉందా అన్న విషయంపై పరిశోధన జరిపారు.
కాన్సర్ అనగానే జన్యుపరమైన అంశాలపైనే ఇంతవరకూ శాస్త్రవేత్తలు దృష్టి కేంద్రీకరిస్తూ వచ్చారు. జీవపరమైన అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఇటీవలి పరిశోధనలు నిరూపించాయి. మరోరకంగా చెప్పాలంటే శరీరంలో చుట్టూ ఉన్న పరిస్థితులు కాన్సర్ పెరుగుదల వేగంపై ప్రభావం చూపుతాయి. మధుమేహం ఇందులో ముఖ్యమైనదని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మింగ్మింగ్ ఉ పేర్కొన్నారు.
కాన్సర్ కణాలు ఒకచోటు నుచి ఇంకో చోటుకు వెళ్లేందుకు శరీరంలోని కణజాలం మధ్య ఉండే మ్యాట్రిక్స్ను ఆసరాగా చేసుకుంటాయి. ఈ మ్యాట్రిక్స్లో కొల్లాజెన్ అనే పీచు కణజాలం కూడా ఉంటుంది. మధుమేహ బాధితుల శరీరంలో ఈ కొల్లాజెన్ తీరు మారుతుందనీ, అలా మారిన కొల్లాజెన్ కాన్సర్ కణాలను మరింత వేగంగా ఒకచోటి నుంచి ఇంకోచోటుకు పంపిస్తుందనీ వీరి పరిశోధనల్లో తేలింది. ఈ పరిశోధన ఫలితాలను ఇంటిగ్రేటివ్ బయాలజీ జర్నల్లో ప్రచురించారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.