బిస్కెట్ ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.. బిస్కట్స్ మీద వచ్చే ఆదాయం కూడా ఎక్కువే.. మార్కెట్ లో దొరికే బిస్కట్స్ ను మనం కూడా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు.. అది కూడా ఓవెన్, గుడ్లు లేకుండా చేసుకుందామా..!? ఆ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం..!
బిస్కట్లు తయారీ విధానం..
కావలసిన పదార్థాలు..
మైదాపిండి ఒక కప్పు, శెనగపిండి పావు కప్పు, బొంబాయి రవ్వ రెండు చెంచాలు, నెయ్యి అరకప్పు, పంచదార పొడి అరకప్పు, ఉప్పు సగం స్పూన్, బేకింగ్ పౌడర్ అర చెంచా, యాలకుల పొడి చిటికెడు.
ఒక బౌల్ తీసుకొని నెయ్యి తప్ప ముందుగా పైన చెప్పుకున్న పదార్థాలు అన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యిని కూడా వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.. పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఇప్పుడు ఒక స్టీల్ పెద్ద ప్లేట్ తీసుకుని దాని మీద ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని బిస్కెట్లు లాగా ఒత్తుకోవాలి. దానిపైన జీడిపప్పు లేదా బాదం పప్పులను పెట్టుకోవచ్చు..
ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో చిన్న స్టాండ్ ఒకటి పెట్టి 5 నిమిషాలు వేడి చేసుకోవాలి.. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న బిస్కెట్లు పెట్టుకున్న ప్లేట్లు దానిపైన ఉంచి.. దానిపైన కూడా మూత పెట్టి సన్నని మంట మీద 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.. మధ్య మధ్యలో బిస్కెట్లు ఉడుకుతున్నాయా లేదా అని చూసుకుంటూ ఉండాలి.. మీరు ఈ బిస్కెట్లను నేరుగా పాత్రలోనే కాకుండా ఆ పాత్రలో ఉప్పు గాని ఇసుక గాని పోసి దానిపైన స్టాండు ఉంచి కూడా బిస్కెట్స్ చేసుకోవచ్చు.