Food: అక్కడ మంచి నీళ్ళ బాటిల్ అక్షరాల 3వేల రూపాయలు, ప్లేట్ రైస్ 7500 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. ఇది నిజమే. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ లో ఈ పరిస్థితి నెలకొంది. ఆఫ్గాన్ లో తాలిబన్లు ప్రవేశించింది మొదలు అరాచకాలు పేట్రేగి పోతున్నాయి. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఆఫ్ఘన్ పౌరులు తాలిబన్ల దుశ్చర్యలకు బలి అవుతున్నారు. అక్కడి పరిణామాలను ప్రపంచం యావత్తూ మౌనంగా గమనిస్తోంది. కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘన్ పౌరులు, ఇతర దేశాల కు చెందిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం గడుపుతున్నారు.
అక్కడ తాగునీటి కోసం, ఆహారం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఆహారం అందక చాలామంది సొమ్మసిల్లి పడి పోతున్నారు. ఇదే అదనుగా ఎయిర్ పోర్టు బయట వ్యాపారులు మంచినీరు, ఆహారాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. లీటర్ మంచినీటి బాటిల్ ను 40 డాలర్లు అంటే సుమారు రూ.3వేలు, ఒక ప్లేట్ రైస్ 100 డాలర్లు అంటే సుమారు 7500 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే అక్కడ ఆహార పదార్థాలను ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ కి బదులుగా డాలర్ల లో అమ్ము తుండటం తో ఆఫ్ఘన్ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పౌరులు ఇంత ఇబ్బంది పడుతున్నా తాలిబన్లు వారికి సాయం చేయకపోగా దాడులు చేస్తున్నారు. ఈ పరిణామాలతో బతుకు జీవుడా అంటూ అఫ్గాన్ పౌరులు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు.