Corona Effect : భారతదేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ నుండి వచ్చే ప్రయాణీకులను తమ దేశంలోకి రాకుండా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నెల 11 నుండి 28వ తేదీ వరకూ భారత్ నుండి న్యూజిలాండ్ కు విమాన రాకపోకలను నిషేదిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జెసిందా ఆర్డెర్న్ ప్రకటించారు. భారత్ నుండి వచ్చే సొంత పౌరులపై సైతం ఈ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ప్రయాణీకుల రాకపోకలపై తాత్కాలిక నిషేదం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తాము అర్థం చేసుకోగలమనీ కానీ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జెసిందా పేర్కొన్నారు.
గత 40 రోజులుగా న్యూజిల్యాండ్లో కరోనా సామాజిక వ్యాప్తి లేదు. అయితే ఇటీవల విదేశాల నుండి న్యూజిలాండ్ కు వచ్చిన ప్రయాణీకులకు సరిహద్దులో పరీక్షలు నిర్వహించగా 23 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 17 మంది భారత్ నుండి వచ్చి వారు కావడంతో న్యూజిలాండ్ అలర్ట్ అయ్యింది. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భారత దేశంలో గత నాలుగు రోజులుగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో లక్షా 24 వేల కేసులు నమోదు అయ్యాయి.