Canada: ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన కెనడాలోని “కామ్ లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్”.. దేశంలో ఒకప్పుడు ఇదే అతి పెద్ద విద్యా సంస్థ.. గత నెలలో ఈ స్కూల్ ప్రాంగణంలో ఒకేసారి 215 మంది పిల్లలు అస్థిపంజరాలు బయటపడ్డాయి. మృతుల్లో మూడేళ్ళ చిన్నారులు కూడా ఉన్నారు. ఒక రాడార్ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు దేశవ్యాప్తంగా మూసి ఉన్న ఇతర రెసిడెన్షియల్ స్కూల్ పై దృష్టి సారించారు. ఈ క్రమంలో వాంకోవర్ లోని కొవెస్సెస్ ఫస్ట్ నేషనల్ ప్రాంతంలోని “మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్” ప్రాంగణంలో రాడార్ ద్వారా సర్చ్ చేయడంతో 600 లకు పైగా గుర్తుతెలియని అస్థిపంజరాలను అధికారులు గుర్తించారు..
ఇందులో వందల మందికి పైగా చిన్నారులను సమాధి చేసినట్లు తెలుస్తోంది. దీంతో తవ్వకాలు చేసి పిల్లల అవశేషాలను బయటకు తీస్తున్నారు.. ఈ అక్రమ పాఠశాల 1889 నుంచి 1977 మధ్య రోమన్ కాథలిక్ చర్చి ఆధ్వర్యంలో నడిచింది. ఈ పాఠశాలలో బలవంతపు మత మార్పిడులు జరిగేవని, మాట వినని వారిని తీవ్రంగా కొట్టేవారని అంటున్నారు. చిన్నారులపై శారీరక, లైంగిక వేధింపులు జరిగాయని, మాతృభాష మాట్లాడినందుకు చిన్నారులను కొట్టేవారని ఇటీవల కెనడా ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇలాంటి చర్యల వల్ల కనీసం 6వేల మంది చనిపోయి ఉంటారని ఒక అంచనా మాత్రమే. మరోవైపు కెనడాకు చెందిన పిల్లలపట్ల విద్యాసంస్థల్లో దారుణాలు జరిగాయంటూ.. 5 సంవత్సరాల క్రితం నిజనిర్ధారణ కమిషన్ ఒక నివేదికను వెల్లడించింది. సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల కనీసం 3,200 మంది పిల్లలు చనిపోయి ఉంటారని ఒక్క కామ్ లూప్స్ పాఠశాలలోనే 1915-1963 మధ్యలో 51 మంది చనిపోయి ఉంటారని ఈ నివేదిక తెలిపింది. అయితే ఈ అక్రమ పాఠశాలలో అంతకు మించిన స్థాయిలో ఏదో ఉదంతం జరిగినట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి..
తాజా సంఘటనలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ట్విట్టర్ వేదికగా స్పందించారు. “చిన్నారుల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మారివల్ రెసిడెన్షియల్ స్కూల్లో చిన్నారుల అస్తిపంజరాలు బయట పడిన వార్త విని నా గుండె వెంటనే బద్దలైంది. ఇది తీవ్ర విచారకరం. ఈ దారుణాల వెనుక ఉన్న వాస్తవాలను మేము ఖచ్చితంగా బయటపెడతామని” ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు..