Imran Khan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూచనల మేరకు అధ్యక్షుడు అరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇది జరిగిన కొద్ది గంటల వ్యవధిలో ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ క్యాబినెట్ సెక్రెటరీ నుండి ఊహించని షాక్ తగిలింది. ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఇమ్రాన్ ఖాన్ ను తొలగించినట్లు కేబినెట్ సెక్రటరీ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఇకపై ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కాదనీ, దేశంలోని బ్యూరోక్రసీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తుందని క్యాబినెట్ సెక్రటరీ ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిపి ప్రధాని పదవి నుండి ఆయనను తొలగిస్తారని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ ఖాసిం సూరి అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు. ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్ తన రాజకీయ చతురతతో సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి విపక్షాలకు షాక్ ఇచ్చారు. ప్రజలందరూ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. సభ రద్దుకు సిఫార్సు చేస్తూ దేశ అధ్యక్షుడికి లేఖ రాసినట్లు చెప్పారు. ప్రధాని ఇమ్రాన్ సూచనల మేరకు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ మంత్రి హబీబ్ ప్రకటించారు.
Imran Khan: ‘ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి కాదు’
ఈ పరిణామం జరిగిన కొద్ది గంటల వ్యవధిలో ఇమ్రాన్ ఖాన్ కు షాక్ ఇచ్చేలా క్యాబినెట్ సెక్రటరీ నుండి ప్రకటన విడుదల అయ్యింది. అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఇమ్రాన్ ఖాన్ ను తొలగించినట్లు క్యాబినెట్ ప్రకటన విడుదల చేసింది. జాతీయ అసెంబ్లీని రద్దు చేసినట్లు కొన్ని గంటల్లో ఇలాంటి ప్రకటన రావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(1), ఆర్టికల్ 58(1) ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్యాబినెట్ సెక్రటరీ పేర్కొంది. ఇకపై ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి కాదని, దేశంలోని బ్యూరోక్రసీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తోందని క్యాబినెట్ సెక్రటరీ ప్రకటనలో స్పష్టం చేసింది.మరో వైపు 195 మంది సభ్యుల మద్దతుతో పిఎంఎల్ఎన్ నేత షెహబాజ్ షరీఫ్ ను ప్రధానిగా ప్రతిపక్షం ప్రకటించింది. అంతకు ముందు అయాజ్ సిద్ధిఖిని జాతీయ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకోగా డిప్యూటి స్పీకర్ ఖాసిమ్ సూరీ దీన్ని తిరస్కరించారు. ప్రభుత్వ రద్దుపై అన్ని వ్యవస్థలను ఆశ్రయిస్తామని విపక్షాలు తెలిపాయి.
పాక్ సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్వా ఉత్కంఠ
మరో పక్క జాతీయ అసెంబ్లీ రద్దు నిర్ణయంపై విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది. ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దేశంలో శాంతి భద్రతల విషయం సైన్యం చూసుకోవాలని కోరింది. అన్ని రాజకీయ పక్షాలు రాజ్యాంగాన్ని అనుసరించాలని సూచిస్తూ నోటీసులు జారీ చేసింది. జాతీయ అసెంబ్లీ రద్దుకు సంబంధించి ప్రధాని, రాష్ట్రపతి తీసుకున్న ఆదేశాలు, తదుపరి చర్యలపై పాక్ సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్వా ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉండగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇప్తిఖార్ పేర్కొన్నారు.