శ్రీలంక క్రికెట్ టీమ్ మాజీ సారధి అర్జున రణతుంగ కు బిగ్ షాక్ ఇస్తూ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ పరిస్థితులపై ఆయన చేసిన దారుణమైన వ్యాఖ్యలకు గానూ ఆయనపై 200 కోట్ల (2 బిలియన్)కు దావా వేయాలని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) నిర్ణయించింది. ఈ మేరకు లెటర్స్ ఆఫ్ డిమాండ్ (ఎల్ఓడీ) పంపినట్లు బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. గత కొంత కాలంగా శ్రీలంక క్రికెట్ పతనం కావడం, బోర్డు వ్యవహారాల్లో స్థిరత్వం లేకపోవడం, అవినీతి వంటి విషయాలపై ఆర్జున రణతుంగ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో శ్రీలంక జట్టుకు ప్రపంచ కప్ అందించిన అర్జున రణతుంగ ఇటీవలే జాతీయ స్పోర్ట్స్ కౌన్సిల్ కు చైర్మన్ గా నియమితులైయ్యారు.
ఇటీవల ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..దేశంలో అత్యంత అవినీతిమయమైన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది శ్రీలంక క్రికెట్ బోర్డేనని వ్యాఖ్యానించారు. బోర్డులో ప్రతి అంశం గందరగోళంగా మారిందన్నారు. యువ ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడంలో బోర్డు పరమచెత్తగా వ్యవహరిస్తొందని ఘాటుగా విమర్శించారు. అర్జున రణతుంగ చేసిన ఈ వ్యాఖ్యలపై శ్రీలంక క్రికెట్ బోర్డు మండిపడుతోంది. సోమవారం జరిగిన శ్రీలంక క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రణతుంక పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. శ్రీలంక క్రికెట్ లోని సుహృధ్భావపూరిత వాతావరణాన్ని దెబ్బతీసేలా, రణతుంగ ఉద్దేశపూర్వకంగా బోర్డుపై ద్వేషభావనలు గుప్పించారని ఆరోపించింది.