Ukraine Russia War: ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిస్థితి సంకటంగా మారింది. ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడి చేపట్టి 17 రోజులు అవుతోంది. అమెరికాతో సహా నాటో సభ్య దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. రష్యాను ఆర్ధికంగా దెబ్బతీయడానికి అమెరికా అనేక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రష్యా భీకరపోరు సాగిస్తుండగా ఉక్రెయిన్ లో భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరుగుతోంది. ఇదే క్రమంలో రష్యా సైనిక దళానికి ఉక్రెయిన్ భారీ ఎత్తున నష్టం కల్గిస్తోంది. ఈ తరుణంలో భారత్ మాత్రం అటు రష్యాతో, ఇటు ఉక్రెయిన్ తోనూ స్నేహాన్ని కొనసాగిస్తోంది.
Ukraine Russia War: రష్యా యుద్ధం చేయడంపై
ఈ నేపథ్యంలో భారత్ కు రష్యా మరో సారి బంపర్ ఆఫర్ ఇచ్చింది. యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయని నిపుణులు హెచ్చరించారు. ఈ తరుణంలో భారత్ కు అతి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ విక్రయిస్తామని రష్యా మరో సారి చెప్పింది. ఇప్పుడు ఏకంగా రష్యా డిప్యూటి ప్రధాని అలెగ్జాడర్ నోవాక్ కేంద్రంతో మాట్లాడారు. కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్ పూరికి ఫోన్ చేసి మాట్లాడినట్లు నోవాక్ తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడంపై అమెరికాతో సహా నాటో దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో గడచిన రెండు వారాలుగా రష్యా చమురు కొనుగోళ్లు భారీగా పడిపోయాయి.
భారత్ కు రష్యా ఆఫర్
ఈ తరుణంలోనే అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 139 డాలర్లకు చేరింది. రష్యా వద్ద కొనుగోళ్లు తగ్గడంతో భారీగా నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో భారత్ కు రష్యా క్రూడ్ ఆయిల్ పై ఆఫర్ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్ ను స్వీకరించాలా..? వద్దా అనే దానిపై భారత్ సంశయంలో ఉంది. రష్యా ఆఫర్ ఇచ్చిన విషయం వాస్తవమేనని కేంద్రం తెలిపింది. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తే అమెరికా, యూరోపియన్ దేశాలకు వ్యతిరేకంగా అడుగులు వేసినట్లు అవుతుంది. రష్యా ఆఫర్ వినియోగించుకుంటే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదులను నియంత్రించవచ్చు. ఇప్పుడు భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.