Ukraine Russia War: ఉక్రెయిన్ లో మానవతా కార్యకలాపాలు చేపట్టేందుకు మంగళవారం ఉదయం 10గంటలు (రష్యా కాలమానం ప్రకారం) తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినట్లు భారత్ లోని రష్యన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. మానవతా కారిడార్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమని తెలిపింది. ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే మరో వైపు రష్యా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. తాజాగా సుమీ నగరంపై జరిగిన బాంబు దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారనీ, పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
Ukraine Russia War: పుతిన్ కు మోడీ ఫోన్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఫోన్ లో మాట్లాడిన అనంతరం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో 50 నిమిషాలు మాట్లాడారు. ఇంకా ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఉన్న భారతీయుల తరలింపునకు సహకరించాలని కోరారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితోనూ నేరుగా చర్చలు జరపాలని పుతిన్ ను మోడీ కోరారు. నేరుగా చర్చలు జరపడం వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ప్రకటించి భారతీయుల తరలింపునకు సహకరిస్తున్నందున పుతిన్ కు మోడీ ధన్యావాదాలు తెలిపారు.
Ukraine Russia War: అజ్ఞాతంలోకి వెళ్లలేదంటూ జెలెన్ స్కీ ప్రకటన
మరో పక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ దేశం విడిచి వెళ్లిపోయి అజ్ఞాతంలో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఆ వార్తలను జెలెన్ స్కీ ఖండిస్తూ వీడియో సందేశం ఇచ్చారు. తాము రాజధాని కీవ్ లోనే ఉన్నానని పేర్కొంటూ వీడియోలో కీవ్ నగర పరిసరాలను చూపించారు. బాంకోవ్ స్ట్రీట్ లోనే ఉన్నాను, తాను దాక్కోలేదు. ఎవరికి భయపడను, త్వరలోనే యుద్ధంలో గెలుస్తామని జెలెన్ స్కీ ధీమా వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య బెలారస్ – పోలెండ్ సరిహద్దులో జరిగిన మూడవ విడత చర్చల్లోనూ పురోగతి కనిపించలేదు. ఈ తరుణంలో జెలెన్ స్కీ ఈ వీడియో సందేశం ఇచ్చారు. మరో పక్క రష్యా సైనిక చర్యలతో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ ను ఆదుకునేందుకు పలు దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థలు ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నాయి. 723 మిలియన్ డాలర్లు రుణాలు, గ్రాంట్ కు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది.
Ukraine Russia War: 10న ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీ
ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి నేపథ్యంలో నాటో దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, రోమేనియా, జర్మనీ, గ్రీస్ లో మరో 500 మంది బలగాలను మోహరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. మూడు విడతలుగా జరిగిన చర్చల్లో పురోగతి కనిపించని నేపథ్యంలో ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీ ఖరారు అయ్యింది. ఈ నెల 10న రష్యా విదేశాంగ మంత్రి సర్గీ లావ్వోవ్ తో భేటీ అయ్యేందుకు సిద్ధమైనట్లు ఉక్రెయిన్ మంత్రి దమిత్రో కులేబా దృవీకరించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?