ఒక ఇరవయ్యేళ్ళ క్రితం తెలుగు జర్నలిజం తీరు గమనించినపుడు – ఈ ధోరణిని ఖండించాలంటే ప్రతిరోజు మరో దినపత్రిక పరిమాణంలో ప్రయత్నాలు సాగాలి అనిపించేది. పైకి అంతా సవ్యంగా, పద్ధతిగా నడిచినట్టే ఉంటుంది. లోపల మాత్రం తమకు, తమ వర్గాలకు ఏమి కావాలో వాటి సాధనమీదే వుంటుంది. ఇది అందరికీ బోధపడదు. సంప్రదాయాలు, చట్టాలు ఈ అంతర్గత వ్యవహారాలను నియంత్రించలేవు. అంతవరకు పత్రికారంగం మీద ఉండే గౌరవం అనే పునాది ఆధారంగా కట్టుకున్న సౌధమది. ఆ సౌధంలో ఉంటూ, తమకు పడని వారిమీద రాళ్ళు వేస్తూ దానికి జర్నలిజం అనే మన్నన తగిలిస్తారు. టెక్నాలజి కారణంగా మీడియాకు పెట్టే పెట్టుబడులు పెరిగాయి. ఫలితంగా సమాంతర వేదికలుగా మారే చిన్న పత్రికలకు ప్రతికూల వాతావరణం తయారయింది. దాంతో జర్నలిజం ఏకోన్ముఖంగా తయారైంది. దీనికి వ్యతిరేకంగా పురుడు పోసుకున్నది సర్వసమగ్రంగా ఉండదు. ఇది ఒక తీరు! రెండవది దిన పత్రికలు నడిపే సంస్థలే వార్తా ఛానళ్ళలోకి ప్రవేశించడం. అప్పటికే టీవీ రంగంలో వినోదపు ఛానళ్ళున్నాయి. అవి తీసుకు వచ్చిన సంప్రదాయాలు, ఆదాయ మార్గాలు స్థిరపడ్డాయి. ఫలితంగా తెలుగు న్యూస్ ఛానళ్ళ మీద పత్రికాసంస్థలు, అందులో ఆధిపత్యం చలాయించే వ్యక్తుల ధోరణులూ; సినిమా పోకడలూ; సీరియల్ కార్యక్రమాల బాణీలు కలవడం ఒక వైపుండగా మీడియా సంస్థలు బాహాటంగా రాజకీయాలు నడపడమో లేదా రాజకీయపార్టీల వెనుక ఉండటమే ఇంకో విషయం. ఇవన్నీ కాకుండా పనిచేసే జర్నలిస్టుల ఆసక్తులు కూడా అపుడపుడు పని చేస్తుంటాయి. ఒక్కోసారి బాగా బయటపడుతుంటాయి.
దాదాపు ఒక సంవత్సరంగా తెలుగు ఛానళ్ళతో ఆంధ్రప్రదేశ్ నాయకులూ, వారి విషయాలు కేంద్ర బిందువుగా సాగుతున్నాయి. అటువంటిది తెలంగాణాలో ఆర్టీసి సమ్మె వార్తా ఛానళ్ళ తీరులో చాలా పోకడలు గమనించేలా చేసింది. సమ్మె సంభవించడానికి ముందే తెలంగాణ రాజకీయాలలో వేరువేరు శిబిరాలు స్థిరపడ్డాయి. అంతవరకు టీఆర్ఎస్ అనేది బిజేపి అనుబంధం అనేలా ఉండేది. ఇపుడు వి6 బిజేపి వాయిస్ గా పరిగణించబడే పరిస్థితి ఏర్పడింది. సాక్షి ఛానల్ కూడా తెలంగాణా విషయాలపట్ల చూసిచూడనట్లుగా సాగేది. కానీ ఆర్టీసి సమ్మెతో ధోరణి మారింది, చర్చలు సమగ్రంగా, విమర్శనాయుతంగా మారాయి. ఏబిఎన్ కూడా కొంత ఎగిరి పడ్డట్టు విమర్శలు గుప్పిస్తోంది. మై హోమ్ ఛానళ్ళుగా పిలవబడి టీవీ-9, ఎన్ టీవీ, 10 టీవీ ఛానళ్ళు కూడా ఏకపక్షంగా సాగడంలేదు. నిజానికి ఈ పోకడలు అభినందనీయం. టీన్యూస్ ప్రభుత్వం నడిపే పార్టీ ఛానల్ కనుక విబేధించే విషయాలకు గొంతుక కలుపదు. అయితే ప్రభుత్వ ధోరణి ఏమిటో అర్థం చేసుకోవడానికి కొంత దోహదపడుతుంది.
ఈ నేపథ్యంలో టీవీన్యూస్ ఛానళ్ళ వార్తలు చూడటం, పరిశీలించడం, విశ్లేషించడం చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే ఏకకాలంలో ఎన్నో ఛానళ్ళు చాలా చాలా డైనమిక్గా సాగుతుంటాయి. పూర్తిగా ఎవరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే యాజమాన్యం ప్రణాళిక సంపాదకునికి గానీ; సంపాదకుని పూర్తి ప్రణాళిక యజమానికి గానీ తెలియకపోయే పరిస్థితి ఉంది. ఒక్క ఛానల్ విషయమే ఇలా ఉంటే పాతిక వార్తా ఛానళ్ళ తీరుకానీ, లోగుట్టు గానీ ఎవరికి తెలుస్తుంది? అంతకు మించి అంతర్గత సమాచారం దాదాపు తెలియని స్థితి ఈ రంగంలో ఉంది. డాక్యుమెంటేషన్ గానీ, పరిశోధన గానీ దాదాపు లేదు. రాజకీయాల గురించి పరిశోధన చేసినపుడు; విశ్లేషణలు రాసినపుడు అనుబంధ విషయంగా మీడియా పరిగణించబడుతుంది. మన దేశంలో సోషియాలజికల్ విషయాలపట్ల అధ్యయనం, ఆసక్తి బాగా తక్కువ. మరి తరుణోపాయం ఎమిటి? ఏమీలేదు, ఫ్రీలాన్స్ గా నా వంటి వాళ్ళు అడపాదడపా చేసే పరిశీలనలే ప్రస్తుతానికి లభ్యం.
డా. నాగసూరి వేణుగోపాల్
9440732392