“రాష్ట్ర ప్రయోజనాల కోసం నాయకులందరూ – పార్టీలకతీతంగా కృషి చేస్తారు. ఏ సందర్భంలోనైనా రాజకీయ నాయకులు కాస్త అటూ ఇటూ అయినా ఐఏఎస్ అధికారులు పనులను దారిలో పెడతారు” — పదమూడు, పదునాలుగు సంవత్సరాల క్రితం రిటైరయిన, తమిళనాడు క్యాడరుకు చెందిన ఒక ఐఏఎస్ అధికారి చాలా విషయాలు చెబుతూ ఈ విషయం కూడా పేర్కొన్నాడు. దీనిని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ప్రచురించారు. ఇలాంటి అంశాలు గమనించే తీరిక మన తెలుగు మేధావులకు, పాత్రికేయులకు, రచయితలకు ఉండదేమో. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మూడు చోట్ల నుంచి ప్రభుత్వం పనిచేసే అవకాశం ఉండవచ్చని ధ్వనిస్తూ మూడు రాజధానులంటూ అసెంబ్లీలో చెప్పారు. అంతే, ఛానళ్ళ యాంకర్లు సర్వజ్ఞులై, చర్చలు చేయడం; పార్టీల నాయకులు ఛానళ్ళలో మాటలతో యుద్ధాలు చేయడం మొదలైపోయింది. అటు రాజకీయులు, ఇటు ఐఎఎస్లు కూడా దారి తప్పిన ఈ సందర్భంలో సరైన దారి చూపించే ప్రయత్నం మాత్రం మీడియా చేయలేకపోయింది
ఆర్టీసి కార్మికులు, బస్సులు ఇప్పుడు వద్దు. నిర్భయ, దిశలు మాకొద్దు. ప్రతిరోజూ కాట్లాడుకోడానికి ఒక టాపిక్ చాలు – అనే రీతిలో తెలుగు వార్తా ఛానళ్ళు సాగుతున్నాయి. తమకు ఆదాయం, టీఆర్పీలు, ప్రకటనలు కావాలి కనుకనే రెండు రాష్ట్రాలకు ఒకే ఛానల్ అనే రీతిలో సాగుతున్నాయి ఛానళ్ళ యాజమాన్యాలు. ఒక ఈటివి తప్ప ఏ మీడియా సంస్థ కూడా రెండు ఛానళ్ళు అవసరమని అనుకోవడం లేదు. ఖర్చు ఎందుకు పెంచుకోవడం అని ముందుకెడుతున్నాయి. ఏ ప్రాంతపు విషయమైనా మాకు ఆ క్షణంలో వీక్షకులు లభిస్తే చాలు అనే రీతిలో పూటగడుపుతూ, టీఆర్పీలు గడిస్తూ సాగుతున్నాయి. బహుశా ఎక్కువ బాధ్యతా రాహిత్యంతో సాగుతూ, తద్వారా మేధావులను, ప్రజలను అదే దిశలో నడుపుతున్నది టెలివిజన్ మీడియానే కావచ్చు. దీని ముందు వచ్చిన ప్రింట్ మీడియా, తర్వాత వచ్చిన సోషల్ మీడియా టెలివిజన్ ట్రాప్లో పడి అదే అజెండాని అంతే వేగంతో కానీ లేదా మారిన వేగంతో కానీ సాగిస్తున్నాయి.
తెలంగాణా ఉద్యమ సమయంలో ఎందుకు తెలంగాణ వద్దు అని గానీ, ఎందుకు సమైక్యరాష్ట్రం కావాలని గానీ ఏ ఛానల్ సంస్థకూ పాలసీగానీ, అవగాహనగానీ, ఆకాంక్షలు గానీ లేవు. పత్రికలయితే ఏ ప్రాంతానికా పాలసీ, ఛానళ్ళయితే ఏ క్షణానికా పాలసి. ఆర్థికంగా నష్టాలతో నడిచే ఛానళ్ళు ఇంత వేగంగా, ఇంత అరాచకంగా ఎలా సాగుతున్నాయో అర్థం కాదు. ఆరేళ్ళ క్రితం సమైక్యరాష్ట్రమని – ఎవరి లోపాయికారి ఎజెండాను మోసాయి? ఇప్పటికీ ఉత్తరాంధ్రకు అన్యాయం, రాయలసీమకు మోసం అంటూ బైట్లు వేస్తూ, విలేఖరులతో మాట్లాడిస్తుంటే – స్టూడియోల్లో యాంకర్లు పానలిస్టులు వాటిని క్యూగా తీసుకుని టైమ్ తెలియకుండా చర్చలు చేస్తారు.
రామచంద్ర గుహను అరెస్టు చేశారనే వార్త గురువారం గుప్పుమంది. ఎంతోమంది సానుభూతితో, సహానుభూతితో వార్తలు ఇచ్చారు. గతసంవత్సరం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో రామచంద్ర గుహ రాసిన వ్యాసం ఎంతమంది తెలుగు పాత్రికేయులు, మేథావులు చదివారో తెలియదు. కేవలం ఎన్నికల ముందు హడావుడి చేసే మీడియా మిగతా సమయంలో పూర్తిగా ప్రజలను పట్టించుకోవడం లేదని ఘాటుగా విమర్శించారు. అంతేకాదు మీడియా వ్యూహాలకు అతీతంగా కర్ణాటకలో మేధావులు ప్రజాచైతన్యం కోసం ఎన్నికల సమయంలో కృషి చేస్తున్నారని అదే వ్యాసంలో రామచంద్ర గుహ మిగతా ప్రాంతాలవారికి పనికివచ్చేలా అక్కడి విషయాలు రాశారు. ఈ వ్యాసాన్ని తెలుగులో అనువదించి ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించారు.
నిజానికి మీడియా మీద విమర్శను మీడియా అంగీకరించదు, అనుమతించదు. డిసెంబరు 19న గుహ అరెస్టు కావడానికి నాలుగు రోజులు ముందు ఒక సంఘటన జరిగింది. గుహ తన వ్యాసంలో టీవీ న్యూస్ ఛానళ్ళను విమర్శిస్తే, ఢిల్లీ నుంచి వచ్చే ‘హిందూస్తాన్ టైమ్స్’ దినపత్రిక ఆ విషయాలు తొలగించి ఆ వ్యాసాన్ని ప్రచురించింది. దాంతో రామచంద్రగుహ ఇక ఆ పత్రికకు రాయనని డిసెంబరు 16న ప్రకటించారు!
బాధ్యత, భవిష్యత్తు అనే కోణంలోంచి మన టీవీ ఛానళ్ళ వాలకం చూస్తే బండి నారాయణస్వామి బహుమతి పొందిన నవల పేరు తప్పక స్ఫురించడమే కాదు, లెక్కలేనంత ఖేదం కలుగుతోంది.
డా. నాగసూరి వేణుగోపాల్