టెక్నాలజి విచ్చుకుని ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పాతిక సంవత్సరాల క్రితం భావించాం. రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలను నట్టింట్లో వివరించి, నిరక్షరాస్యులను కూడా చైతన్యపరుస్తాయని ఆశించారు. అలా కొన్ని దేశాలలో జరుగుతోందని ఆనందపడ్డారు కూడా! మూడేళ్ళ కిందటి లెక్కల ప్రకారం మొత్తం భారతదేశపు టీవీ ఛానళ్ళ సంఖ్య తొమ్మిదివందలు కాగా, వాటిలో నాలుగు వందల దాకా న్యూస్ ఛానళ్ళే! ఇన్ని ఛానళ్ళు వచ్చాక ప్రతి సందర్భం కూడా గమనించేవారికి ఒక అవకాశంలా మారిపోయింది. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం సాగుతున్న వేళ అంతా సమైక్యతారాగం వినబడింది. పత్రికలను, ఛానళ్ళను కూడా నడిపే సంస్థల ధోరణి పత్రికలలో స్పష్టంగా కనబడింది. ఇంటర్నెట్ కారణంగా ఇరు ప్రాంతాల ఎడిషన్లు గమనించే అవకాశం కల్గింది. అచ్చు పత్రిక కనుక ఆ క్షణంలో చెరిపివేయడం కూడా సాధ్యం కాదు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి తెలుగు న్యూస్ ఛానళ్ళు చాలా స్పష్టంగా రెండు వర్గాలుగా విడిపోయాయి. మొన్న మొన్నటి దాకా తెలుగు మీడియా అంతా ఒక ప్రాంతం లేదా కొన్ని జిల్లాల యజమానుల చేతిలో ఉండేది. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాదులో కీలకస్థానాలలో ఉండే జర్నలిస్టులు ఉద్యమానికి అనుకూలంగా పనిచేశారు. తమకు టీఆర్పిలు వస్తున్నాయి, తమకు సమస్యలు ఏమీ లేవని యజమానులు కూడా చూసీచూడనట్లు ఉండిపోయారు. అయితే అమరావతి కేంద్రంగా నడుస్తున్న రాజకీయాల విషయంలో అలా సాగే అవకాశం లేకుండా పోయింది.
ఈటీవీ, టీవీ5, ఎబిఎన్, మహాటీవీ, ఎపి24×7 మొదలైన ఛానళ్ళు అమరావతి రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా తమను తాము మలచుకొన్నాయి. సాక్షి ఛానల్ జగన్మోహనరెడ్డిగారిదే కనుక అందులో సాగే వాదనలో దాపరికం ఉండదు. ఆ ప్రభుత్వ విధానాలకు అనుకూలంగానే వార్తలను, చర్చలను ఇస్తోంది. అమరావతి అనుకూలంగా సాగే ఛానళ్ళలో చాలావాటిలో కనీసం ఒక ప్రతినిధి అయినా విభిన్న వాదన వినిపించే అవకాశం చర్చలలో ఉంటుంది. ఈటీవీలో అటు వంటి చర్చలుండవు కనుక ఆమాత్రం ప్రతిస్వరం కూడా వినిపించదు. కేవలం కొన్ని ప్రాంతాల వార్తలు తమకు నచ్చిన విధానంలో ఇస్తున్నారు.
ముఖ్యంగా ఈటీవీ బాణి బాగా స్పష్టంగా బయట పడుతోంది. నాదెండ్ల భాస్కరరావు విషయం గానీ, రామారావును తొలగించినపుడు గానీ ఇంత స్థాయిలో మీడియా విషయాలు బయటకు రాలేదు. సోషల్ మీడియా కూడా అప్పట్లో లేదు. కానీ నేడు పరిస్థితి వేరుగా ఉంది. అమరావతిలో జరిగిన అవినీతికి సంబంధించిన ఆరోపణలు న్యాయస్థానాల్లో ఋజువు అయ్యేదాకా మీడియా తీర్పు చెప్పనక్కరలేదు. ప్రస్తుత పాలకపార్టీ ఎత్తుగడ కొందరు భావించినట్టు రాజకీయ ఎత్తుగడ అనే విషయం కూడా నిజం కావచ్చు. ఇవి రాజకీయపార్టీలకు, ఆయా పార్టీల నాయకులకూ; ప్రజలకు సంబంధించిన వ్యవహారం. మీడియా ఇరు వర్గాల వార్తలు ఇవ్వాల్సి ఉంది – తాము చెప్పుకునే ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రకారం. ఈటీవీలో అరగంట వార్తల బులెటిన్లలో 29 గ్రామాల నిరసనల వార్తలే పది నిమిషాల దాకా ఉంటున్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి కార్యక్రమం గురించి ప్రస్తావిస్తున్నారు కానీ ఈ విషయానికి సంబంధించి అమరావతికి రెండు వైపులా ఉండే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల సమాచారాన్ని పూర్తిగా నిషేధిస్తున్నారు. అమరావతి రైతులకు అన్యాయం జరిగినపుడు, ఇతర ప్రాంతాల వారికి ఎంతో కొంత ప్రయోజనం జరిగి ఉండాలి. అలా జరగక పోతే వీరు అన్యాయమని ఆక్రోశించే పరిస్థితి లేదు కదా! ఇటీవల మరీ అమరావతి వార్తలనే పూర్తిగా నింపేస్తున్న ఈటీవీ ఎన్ఆర్సి వగైరా నిరసన వార్తలను కూడా అస్పృశ్యం చేసిందనే కీర్తిని మూటగట్టుకుంది.
ఇక్కడ గమనించాల్సింది ఏమంటే – రేపు ఓటు వేయరనే భీతి రాజకీయ పార్టీకి ఉంటుంది. మీడియా సంస్థలకు ఆ మాత్రం జాగ్రత్త విశ్వసనీయత విషయంలో లేకపోతోంది. ఏ విషయమైనా, ఏ సందర్భంలోనైనా తమ వాదనతో నెగ్గించుకొని మీడియా వాణిజ్యం సాగించుకోవచ్చనే ‘అతివిశ్వాసం’ వారిలో నిండిపోయింది. లేకపోతే ఇంతస్థాయిలో ఒంటికంటి చూపుతో వార్తలను రోజుల తరబడి పరిశీలించే అమాయకులు ప్రస్తుత పరిస్థితిని ఒక ‘లిట్మస్ టెస్ట్’గా పరిగణిస్తున్నారు. కానీ మీడియా సంస్థలకదేమీ పట్టదు. తమ తెంపరితనం తమదే! తమ మొండితనం తమదే!
– డా. నాగసూరి వేణుగోపాల్