మూడు మీడియా సంస్థలు, లేదా ఐదు మీడియా వేదికలను గురించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి తన ప్రమాణస్వీకార ప్రసంగంలో ప్రస్తావించారు. ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-5 – తమ వార్తాప్రసారాలలో ఆవాకులు, చవాకులూ ప్రసారం చేయడం తగదని ఒకరకంగా హెచ్చరించారు. దీనిపై ఈ వార్తా సంస్థలు కానీ, ఇతర సంస్థలు కానీ పెద్దగా చర్చించినట్టు కనబడలేదు. ఎందుకో ఈ వివక్ష? అయితే మహాటివి చానల్లో కొంత చర్చ జరిగింది. చానల్కు నాయకత్వం వహించేవారు ఎలా ఉంటారో అందరికీ తెలుసు కానీ, వ్యాఖ్యాత కూడా అంత జాగ్రత్తగా మాట్లాడటం అవసరమా?
గంటలు గంటలు గరుడపురాణాలు ప్రసారం చేసిన టీవీ-9, రవిప్రకాష్ అంతర్థానంతో బాణి మార్చింది. మాజీ సిఈవో దొరకలేదు కానీ మిగతా ఉద్యోగులు వారే కనబడుతున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండటమే కాదు, ఇప్పుడు జగన్ గురించిన వార్తలు కూడా బాగా ఇస్తున్నారని సగటు వీక్షకుడు కూడా ఎలాంటి సర్వే అవసరం లేకుండా చెప్పగలుగుతున్నాడు.
గతవారం చర్చించుకున్నట్టు – ఇపుడు తెలుగు టీవీ చానళ్ళు గమనిస్తే జగన్ వార్తలే వస్తున్నాయి. ఇదివరకు ఆ స్థానం అలంకరించినవారికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్, రుణాంధ్రప్రదేశ్ అంటూ ఇపుడు దాదాపు ఎక్కువభాగం చానళ్ళు చర్చలు పెట్టి, పోగులు తీస్తున్నాయి. ఇపుడే ఎందుకు? జగన్ ప్రకటనలలో ఆ వివరాలు ఉన్నాయనా? నిజానికి, మీడియా కొంత పరిశోధన చేసి ఇటువంటి కథనాలు నాలుగు నెలలు క్రితం ఇచ్చి ఉంటే అప్పటి ప్రభుత్వం దుబారా చేయకుండా జాగ్రత్తపడేది కదా! ఇది మీడియా బాధ్యతా రాహిత్యమే కాదు అవకాశవాదం కూడా!
రెండు వారాల క్రితం ఎగ్జిట్ పోల్స్ సర్వేలకు ముందు ఒక రోజు మించి అన్ని తెలుగు న్యూస్ చానళ్ళు డ్రగ్స్ పంపిణీ, సినిమా స్టార్స్ లింకు అంటూ చర్చలు చేశాయి. ఎందుకు? ఒక బాధ్యతగల వ్యక్తి సమాచారహక్కు చట్టం ద్వారా ఈ వివరాలు వాకబు చేస్తే సినీతారలు తప్పుచేయలేదు అని సమాచారం లభించింది. దీని ఆధారంగా పూరి, చార్మీ… ఇలా ఎంతోమంది ఫొటోలు చూపిస్తూ చర్చలు చేశారు. ఈ విషయం గురించి తొలుత ఎంత హడావుడి చేశారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు? అప్పుడు ఎందుకు చేశారు? తర్వాత ఎందుకు ఫాలోఅప్ చేయలేదు? కొబ్బరికాయ ఎప్పుడు దొరికినా టీఆర్పి పండగకోసం ఎవర్ రెడీగా ఉంటాయి తెలుగు న్యూస్ చానళ్ళు. ఈ ప్రశ్నలు ఎదురయితే ఆక్షణంలో మన జర్నలిస్టు మిత్రులు ఏదో చిన్న రాజకీయ కారణం చెప్పి సర్దేసే వివరణలు ప్రసారం చేస్తారు. టీవీ-9 రవిప్రకాష్ వార్త గుప్పుమనగానే ఇంటర్ విద్యార్థుల మరణాల మీద డిబేట్ కారణం అంటూ ఏదో అల్లేస్తారు. అయితే ఆయన అఖండుడని ఇప్పుడు తెలుస్తోంది. ప్రథానితో హిందీ చానల్ ప్రారంభోత్సవం చేస్తూ యాజమాన్యానికి సరిగా సమాచారం ఇవ్వలేదని ఇప్పుడంటున్నారు. అంటే సరైన పరిశోధనకాదు, కనీసం ఇంగితంతో ఆలోచనచేయకుండా నేపథ్య కథనం సిద్ధం చేస్తారు. డ్రగ్స్ వ్యవహారం మరచిపోయారు. మళ్ళీ దాని ప్రస్తావన రాగానే ఒకరోజు పండుగ చేసుకుని మళ్ళీ నిద్రపోయారు.
అసెంబ్లీ ఫలితాలు రాగానే తెలుగు దేశానికి పవన్ కళ్యాణ్ దెబ్బ అంటూ 30 సీట్ల గురించి రెండు మూడు రోజులు చర్చలు చేశారు. అంతేకానీ ముందు అధికారంలో ఉన్న రాజకీయ పక్షం ఎందుకు ఎక్కడ వైఫల్యం చెందింది అని చర్చించకుండా ఎవరో సూచిస్తే కార్యక్రమాలు రూపొందిస్తారా అనే సందేహమొచ్చేలా చానళ్ళు సాగుతున్నాయి.
ఏ చానల్ అయినా తన బలం ఏమిటో, లోపం ఏమిటో తెలుసుకోవాలి. కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన రోజున రాత్రి వార్తలలో ఎన్ టీవీ ఢిల్లీ ప్రతినిధితో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఏ ప్రశ్నకూ కూడా పూర్తిగా జవాబు చెప్పనివ్వకుండా లైవ్ లో ఉన్న యాంకర్ సాగాడు. కొత్తగా మంత్రులయిన పలువురి గురించి ఎన్నో విషయాలు చెబుతున్న వారి ఢిల్లీ ఎడిటర్ను అలా అడ్డగించడం ఏమిటో? వీరి పై స్థాయిలో ఉన్న వారు గమనించారో లేదో కానీ – హైదరాబాదులో ఉండి ఢిల్లీ విషయాలు చెప్పడం వేరు, ఢిల్లీలో ఉంటూ ఢిల్లీ సంగతులు వివరించడం వేరు. నిజానికి చక్కగా అరగంట నిడివి కార్యక్రమం చేయదగ్గ సమాచారాన్ని అలా బండ బండగా ఆపేయడం ఏమిటో? ఎందుకో?
అనుకోకుండా ఇటీవల 99 టీవీలో రాత్రి 9 గంటలకు రోజా చదివిన బులెటిన్లో చివరి అంశం జుగుప్స అనిపించింది. రకుల్ ప్రీత్ సింగ్ రకరకాల డ్రస్సులతో ఉందని వివరించిన అంశం అసలు ప్రైమ్ టైమ్ బులెటిన్ ఐటమ్ కాదు. స్క్రిప్ట్ రాసిన వీరుడు ఎవరో, ఆమోదించిన ఎడిటర్ ఎవరో కానీ రోజా దీన్ని చదవడం చూసేవారికి ఇబ్బంది కలిగించింది. ఎవరు చూస్తారోలే అని వీరి నమ్మకమా?
-డా.నాగసూరి వేణుగోపాల్