దుబ్బాకలో ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోతారు..!? సెంటిమెంట్ పండిందా..? లేదా, రఘు కష్టం ఫలించిందా..? లేదా..? అనేది పక్కన పెడితే.. ఓ కొత్త రాజకీయ అధ్యాయం మాత్రం ఆరంభమవుతున్నట్టే. టీఆరెస్ కి ప్రత్యర్థి వచ్చినట్టే.. కాకపోతే ఈ ప్రత్యర్థి కృత్రిమమా..? సహజమా అనేదే ఈ కథనంలో సారాంశం..!!
గెలుపు.. ఓటమి.. క్లుప్తంగా..!!
ఈ ఎన్నికల్లో గెలుపుపై ఎవరికీ పెద్దగా అనుమానాల్లేవు. ఎందుకంటే ఒక అధికార పార్టీతో.., అధికార యంత్రాంగంతో.., ఒక మంత్రితో ఇద్దరు ప్రత్యర్థులు తలపడ్డారు. సో.. సాధారణంగానే గెలుపు సులువవుతుంది. మెజారిటీ పక్కన పెడితే గెలుపు విషయం మాత్రం ఒక క్లారిటీ ఉన్నట్టే. కానీ… భారీ మెజారిటీ ఆశించకూడదు అనేది టీఆరెస్ వర్గాలే అంతర్గతంగా అంగీకరిస్తున్నాయి. ఒకరు 50 వేలు అంటుంటే, ఒకరు 25 వేలు అంటున్నారు.., ఇంకొకరు ఒక్క ఓటుతో గెలిచినా గెలిచినట్టేనోయ్ అంటూ కప్పేస్తున్నారు. అందుకే గెలుపు ధీమా ఇచ్చినా.. ఇంత చెమటోడ్చి గెలిచామా..? అనే భయం మాత్రం కలిగిస్తుంది.
* మరో కీలక అంశం ఏమిటంటే..? ఇక్కడ టీఆరెస్ గెలిస్తే అధికార పార్టీ గెలిచినట్టు. పెద్దగా విశేషమేమీ లేదు. బీజేపీ గెలిస్తే రఘునందనరావు గెలిచినట్టు. రఘు వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. అందుకే ఈ సారి బాగా కష్టపడ్డారు. తనపై సింపతీ కలిగేలా ప్రచారం చేసారు, బాగా తిరిగారు. కానీ పోల్ మేనేజ్మెంట్ లో మాత్రం వెనుకబడ్డారు. అధికారం తోడు లేక, అడుగడుగునా అడ్డంకులతో.., ఇబ్బందులతో నెట్టుకొచ్చారు. ఒకటి మాత్రం నిజం టీఆరెస్ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టిపెడితే.., బీజేపీ మాత్రం పొలిటికల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టింది.
టీఆరెస్ తయారు చేసుకున్న ప్రత్యర్థి..!!
ఎస్..! దుబ్బాకలో టీఆరెస్ స్వయంగా తన ప్రత్యర్థిని తయారు చేసుకుంది. రాజకీయాల్లో ప్రత్యర్థిని ఎంత పట్టించుకోకపోతే.., వాళ్ళని అంత చులకన చేసినట్టు అనే ఒక సూత్రం ఉంటుంది. టీఆరెస్ దుబ్బాకలో ఈ సూత్రాన్ని మర్చిపోయింది. నిజానికి తెలంగాణలో టీఆరెస్ కి కాంగ్రెస్, బీజేపీ సమ ప్రత్యర్ధులు. ఇంకా చెప్పుకోవాలంటే కాంగ్రెస్సే కొంచెం గట్టి ప్రత్యర్థి. అటువంటిది కాంగ్రెస్ ని, బీజేపీని సమ దూరంలో చూడాల్సిన టీఆరెస్ బీజేపీని హైలైట్ చేస్తూ వచ్చింది. బీజేపీని టార్గెట్ చేసింది. బీజేపీపై తమ ప్రతాపం చూపించింది. తద్వారా “ఓహో… దుబ్బాకలో టీఆరెస్ కి వణుకు మొదలయింది.., బీజేపీ యాక్టీవ్ అయింది. అందుకే ఈ గొడవలు” అనే చర్చ మొదలయింది. పోలింగ్ కి వారం రోజుల ముందు వరకు సో.., సో.. గా ఉన్న ప్రచారం… ఒక్క గొడవతో బీజేపీని బలోపేతం చేసింది, టీఆరెస్ ని వణికించింది. అలా.. తన స్వీయ తప్పిదాలతో బీజేపీ అనే ప్రత్యర్థిని టీఆరెస్ తయారు చేసుకుంది.
హరీష్, కేసీఆర్ బుర్ర ఏమైనట్టు..!?
ప్రత్యర్ధులు ఇద్దరినీ సమ దూరంలో చూస్తే తమ వ్యతిరేక ఓట్లు సమంగా చీలిపోయేవి. కాంగ్రెస్ ని కూడా టార్గెట్ చేస్తే.. ఆ పార్టీకి కొంత సానుభూతి ఓట్లు పాడేవి. కానీ ఎంతసేపూ బీజేపీని టార్గెట్ చేయడం.., బీజేపీని విమర్శించడం.., బీజేపీతో సవాళ్లు చేసిన ఫలితంగా బీజేపీ ఎదిగింది. రఘుపై సింపతీ ఉంది, బీజేపీ బలోపేతమవుతుంది..! అప్పుడు ఇలా గొడవలు, వివాదాలకు పోతే అది మరింత పెరిగే అవకాశం ఉంటుంది తప్ప.., తగ్గేది కాదు. కేవలం ఈ సింపుల్ రాజకీయ లాజిక్కుని పట్టుకోలేక.. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆరెస్ చెమటలు కక్కింది. ప్రత్యర్థిని పైకి లేపింది. అది అక్కడితో ఆగదు. టీఆరెస్ కి గెలిచినా.. బీజేపీలో ఈ ఊపు, జనంలో ఈ సందడి మాత్రం చాలా కాలం ఉంటుంది. అందుకే ఏమో..! లేపి మరీ తన్నించుకోడానికి టీఆరెస్ సిద్ధపడాలేమో..!? చూద్దాం..!