వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ నోట పదేపదే వచ్చి పాపులర్ అయిన ‘ఆ రెండు పత్రికలు’ ఇక జగన్ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి కాబోలు! గురువారం ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు చూస్తే అలా అనిపిస్తున్నది. రెండు పత్రికలూ కూడా జగన్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమావేశాన్ని మొదటి పేజీలో ప్రధాన వార్తగా ఇచ్చాయి.
నిజానికి ఆ ఇద్దరు నాయకుల సమావేశం ఆ మాత్రం ప్రాధాన్యత ఇవ్వదగిన వార్తే. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పొరుగు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు రాజకీయంగా సమావేశం కావడం ప్రాధాన్యత లేని అంశం అని అనలేం కదా! ఇక్కడే కీలకమైన ప్రశ్న తలెత్తుతుంది: వైఎస్ జగన్ ఇట్లాంటి సమావేశాలలో పాల్గొన్నపుడు మాత్రమే ఆయనకు సంబంధించిన వార్తలకు ప్రాధాన్యత లభిస్తుందా?
ఉదాహరణకు మొన్నామధ్య జగన్ శ్రీకాకుళం జిల్లాలో తన ప్రజాసంకల్ప యాత్రను ముగించారు. ప్రతిపక్ష నాయకుడు సుదీర్ఘంగా చేసిన పాదయాత్ర అది. దానికి అంధ్రజ్యోతి, ఈనాడు మీడియాలో ఇవ్వాల్సినంత కవరేజీ ఇవ్వలేదు. బహిరంగ సభలో జగన్ ప్రసంగాన్ని అందరూ లైవ్ ఇవ్వగా ఇటివి మాత్రం దాని జోలికే వెళ్లలేదు. జగన్ వార్తలను అంధ్రజ్యోతి, ఈనాడు మీడియా ఇవ్వవు అనడానికి లేదు. ఇచ్చాము అని చెప్పుకునేందుకు కావాల్సినంత మాత్రమే ఇస్తాయి.
జగన్ వార్తలు వైఎస్ఆర్సిపికి నష్టం చేస్తాయని అనుకున్నపుడు మాత్రం వాటికి ఎక్కడ లేని ప్రాధాన్యత దొరుకుతుంది. జగన్, కెటిఆర్ సమావేశం వార్త అలాంటిది.
అంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకూ ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు రాజకీయంగా ఎవరి పక్షాన ఉన్నదీ అందరికీ తెలిసిన విషయమే. ఈనాడు అధినేత రామోజీరావు కాంగ్రెస్ వ్యతిరేకత జగద్విదితం. ఆయనే స్వయంగా ఆ సంగతి తన దినపత్రికలో మొదటి పేజీలో తన సంతకంతో రాసుకున్నారు. ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మొదటిసారి అధికారంలోకి రావడం వెనుక ఈనాడు కృషి ఎంత ఉన్నదీ కూడా అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రామోజీరావు సాన్నిహిత్యంపై ఒక దశలో అనుమానం తలెత్తినా 2004 ఎన్నికలలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన అనంతరం వారిద్దరి సాన్నిహిత్యానికి అవసరం కూడా జోడయింది.
ఇక ఆంధ్రజ్యోతి మానేజింగ్ డైరక్టర్ రాధాకృష్టతో చంద్రబాబు స్నేహం సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగడం ఆయనకు రెండు విధాల అవసరం. ఒకటి ఆర్ధిక లాభం. రెండు: టిడిపి కాక ఎవరు అధికారంలోకి వచ్చినా ఆయనకు నిత్యం పోరాటం తప్పదు.
ఆ రెండు పత్రికల వార్తల కవరేజిని ఈ నేపధ్యం నుంచి పరిశీలిస్తే జగన్ వార్తలకు వాటిలో దొరికే ప్రాధాన్యత గానీ, దొరకని ప్రాధాన్యత గానీ ఆశ్చర్యం కలిగించవు. నిజానికి వైస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సాక్షి పత్రిక, న్యూస్ ఛానల్ పెట్టిందే అందుకు. తెలుగు మీడియా ఈ విధంగా పార్టీల వారీగా చీలిపోవడం కారణంగా ప్రజల్లో మీడియా ప్రతిష్ట బాగా పలచబడి పోయింది.
మరి ‘ఆ రెండు పత్రికలు’ అంటూ వచ్చిన సాక్షి ఎలా వ్యవహరిస్తున్నది? ఆ మీడియా సంస్థ యాజమాన్యం వార్తల కవరేజి విషయంలో నిష్పాక్షికంగా ఉంటున్నదా? లేదు. ఇప్పడున్న పరిస్థితుల్లో ఉండాలని కోరుకోవడం కూడా అత్యాశే అవుతుంది. ఉండకపోవడానికి సాక్షిని తప్పు పట్టలేం కూడా.
అయితే సాక్షి దగ్గర ఒంటెద్దు పోకడ తప్ప లౌక్యం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, ఛానళ్లు ఎంతో కొంత మర్యాదగా వ్యవహరించి విశ్వసనీయతను కాపాడుకునేందుకు చూస్తాయి. వైఎస్ఆర్సిపి వంటి గిట్టని పార్టీల వార్తలు కూడా ఇస్తారు. ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తారా లేదా అన్నది వేరే సంగతి. అదును చూసి దెబ్బ తీస్తాయి. సాక్షి అలా కాదు. తమ పార్టీ వార్తల కవరేజీ, ఎదుటి పార్టీపై దుమ్మెత్తి పోయడం తప్ప మరోటి వారికి తెలియదు. ఫలితంగా సాక్షిని వైఎస్ఆర్సిపి గొంతుగానే తప్ప ప్రజలు మరో రకంగా చూడరు. అందుకు విరుద్ధంగా అంధ్రజ్యోతి, ఈనాడు మీడియాను పాఠకులు, వీక్షకులు అందరూ కాకపోయినా చాలమంది తటస్థ మీడియాగానే చూస్తారు. సాక్షి దగ్గర ఆ వ్యూహం కొరవడింది.
-హితైషి