కరోనా ప్రారంభంలో ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు ఆంధ్ర ప్రదేశ్ కు 10 కోట్ల రూపాయలు, తెలంగాణకు 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి గొప్పవాడు అనిపించుకున్నారు. కానీ ఆ ఇచ్చిన విరాళంలో కనీసం పదిశాతం అంటే రెండు కోట్లు రూపాయలు ఉద్యోగులకు కేటాయించి, ఈ మూడు నెలలు ఉద్యోగులకు సగం జీతాలు ఇచ్చి అదుకున్నా సరే బాగుండేది అంటున్నారు. ఈనాడు సంస్థలో పెద్ద స్థాయి ఉద్యోగులను పక్కన పెట్టి ఇప్పుడు చిన్న స్థాయి ఉద్యోగులపై పడ్డారు. ఈనాడులో లక్ష, అంత కంటే ఎక్కువ వేతనాలు ఉన్న వారు చాలా మంది ఉన్నారు. వాళ్ల వేతనాల్లో సగం కోసినా సరే వారి కుటుంబాలకు ఇబ్బంది కాదు. కానీ వారి వేతనాల్లో కోత లేకుండా, అరకొర కోతలు విధించి, చిన్న స్థాయి ఉద్యోగులను పూర్తిగా పక్కన పెట్టారు. అలా దాదాపు 1500 నుండి 2 వేల మంది వరకు ఉంటారని సమాచారం.
ఈ కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమండ్రి ఈనాడు యూనిట్ కార్యాలయం వద్ద తొలగించబడిన సిబ్బంది ప్లకార్డులు పట్టుకొని ధర్నా నిర్వహించారు. అయితే ఈనాడు సంస్థ తొలి నుండి భవిష్యత్తులో తమకు దిగువ స్థాయి సిబ్బంది నుండి ఎటువంటి లీగల్ సమస్య లు తలెత్తకుండా ఉండేందుకు వారిని సంస్థ ఉద్యోగులుగా పరిగణించేది కాదు. వేరువేరు సంస్థల గుర్తింపు కార్డులతో ఈనాడు లో సర్కులేషన్, అడ్వర్టైజ్మెంట్ విభాగాల్లో పనిచేస్తుంటారు.
కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో పేపర్ సర్కులేషన్ తగ్గిపోవడం, ప్రకటనల ఆదాయం పూర్తిగా తగ్గిపోవడంతో పేపర్ కు కష్టాలు, సిబ్బందికి ఊస్టింగులు ప్రారంభం అయ్యాయి. దీనితో సిబ్బంది రోడ్డున పడుతున్నారు. రాజమండ్రి ఈనాడు యూనిట్ పరిధిలో ఎంఎంపిఎల్ రీటా, సీఆర్జీ (ఈనాడు) అడ్వర్టైజ్మెంట్, సర్కులేషన్ విభాగాలు నందు పనిచేస్తున్న సిబ్బందిని విధుల నుండి తొలగించడంతో వారు తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఈనాడు కార్యాలయం ముందు ఇలా ధర్నా నిర్వహించడం ఇదే మొదటిది అయి ఉండవచ్చు.