రాసుకున్న వార్తలూ, లేదా రాసి పెట్టిన వార్తలు చదవడం వేరు. అలాకాక లైవ్ కార్యక్రమాలు నిర్వహించడం, ఫీల్డ్ నుంచి రిపోర్టు చేయడం లేదా ఫీల్డ్ నుంచి జవాబులు లైవ్గా చెప్పడం వేరు! ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ల బదిలీ వార్తల సమయంలో ఎన్టీవీలో యాంకర్ ఫీల్డ్ రిపోర్టర్ను అడుగుతోంది – ఇది కక్షపూరిత చర్య కదా అని. బదిలీ అనేది ఒక మామూలు విషయమూ; ప్రభుత్వం మారినపుడూ, ప్రభుత్వ నిర్ణయాలు పూర్తిగా తారుమారు అవుతున్నపుడు – బదిలీలు అధికార్లకు కూడా మంచిది అని రిపోర్టర్ వివరించాడు. అలాగే మరోసారి టిడిపి ఎం.పి.లు బిజెపిలో చేరిన రోజు ఎన్టివీలో ఢిల్లీ రిపోర్టర్ వివరించిన తీరూ, అలాగే స్టూడియో నుంచి అర్థవంతంగా సమాచారం రాబట్టిన తీరు బావుంది. దీనికి అరుణ, రుషిగార్లను అభినందించాలి. ఈ దృష్టాంతాలూ ఒకే ఛానల్వి. అయితే స్టూడియోలో లైవ్ నిర్వహించేవారి పరిజ్ఞానానికి సంబంధించిన పరిమితి గురించి కూడా విశదం చేస్తాయి. ఇంకా ఈ రెండు సందర్భాలలో ఫీల్డ్ రిపోర్టర్ల పరిణితిని కూడా విశదం చేస్తున్నాయి.
తొలకరి మొదలైంది. వర్షం హడావుడి మొదలైంది. దీనికి సంబంధించి టీవీ-9లో శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఒక రిపోర్ట్ ఆసక్తికరంగా ఉంది. పాములు బొరియల నుంచి రావడం, సేద్యం చేసుకునేవారిని కాటువేయడం, కొందరు మరణించడం, సరైన వైద్యం దొరకక పెరిగిన మరణాలు – ఇదీ వార్త. అయితే బంగారం బదులు గోల్డ్ అనే టీవీ 9 ఇక్కడ మాత్రం పాము బదులు సర్పం అనడం విశేషం. గ్రామీణ విలేఖరి పదే పదే సర్పాలు అనడం మాత్రమే కాదు, డెస్క్ మహాశయులు కూడా సర్పమనే మాట శీర్షికలో వాయిస్ వోవర్లో వాడారు. దీనికి పరాకాష్ట ఏమిటంటే బొరియలు కోల్పోయిన పాముల భవిష్యత్ ప్రణాళికల గురించి విలేఖరి వివరించడం. సర్పాలు ఎక్కడ ఆవాసాలు వెతుక్కుంటాయో వేచి చూడాలి అంటూ ఆ టీవీ-9 విలేఖరి తన రిపోర్టింగ్ ముగించారు! అదే సమయంలో టీవీ-9 పోడు సేద్యం గురించి పొలిటికల్ మిర్చి సమయంలో ప్రసారం చేసిన ఐటమ్ చాలా అర్థవంతంగా, ఔచిత్యవంతంగా ఉంది.
టీవీ-9 అనగానే రవిప్రకాష్ గుర్తుకు రావడం పరిపాటి. వారికి సంబంధించిన వార్తలు ఈ వారం లేవు కానీ వేషం మార్చి దొరికిపోయిన గరుడ పురాణం శివాజీ వార్తగా మారాడు. వారు విచారణకు రావడం ఈవారం వార్త కాబోతున్నారు. ఎన్డిటీవీ ప్రణయ్రాయ్ ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఇటీవల వార్తల్లోకి రాగా ఇపుడు ఇంద్రాణి ముఖర్జీ అప్రూవర్గా మారారని సమాచారం. మన దేశంలో స్టార్ గ్రూప్ ప్రవేశించిన మలిదశలో దాని వ్యవహారాలు జరిపినవారు పీటర్ ముఖర్జీ. ఈయన, ఈయన భార్య ఇంద్రాణి ముఖర్జీ కలిసి ఐఎన్ఎక్స్ అనే ఛానల్ ప్రారంభించి ఛానల్ యజమానులయ్యారు. ఇంద్రాణి ముఖర్జీ కూతురి మరణం సంబంధించి అభియోగాలు ఎదుర్కొని పీటర్ దంపతులు సంచలనమయ్యారు. ఇది కాకుండా ఈ సంస్థ నిబంధనలు ఉల్లంఘించి లబ్ది పొందిందనీ, ఈ వ్యవహారంలో చిదంబరం కుమారుడు కార్తి కూడా లబ్ది పొందాడని మరో కేసు. దీనిలో ఇంద్రాణి ముఖర్జీ అప్రూవర్గా మారడం ఇటీవలి పరిణామం.
టీవీ-9 అమ్మకం వ్యవహారంలో 300 కోట్లు హవాలా మార్గంలో చేతులు మారిందని రవిప్రకాష్ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో వెల్లడించి చాలామందికి ఆశ్చర్యం కలిగించాడు. ఇప్పుడు మై హోం సంస్థపై జూలై 4న ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 3000 కోట్లు దాకా లెక్కతేలని హవాలా ధనం అని సమాచారం. అయితే చాలా ఛానళ్ళు, పత్రికలు ఈ విషయాలను స్పృశించలేదు. ఒకటి రెండు ఛానళ్ళు స్క్రోలింగులు వేసి సర్దుకున్నాయి. సరిగ్గా ఇలాంటి చోట్లనే సోషల్ మీడియా పాత్ర గణనీయంగా మారుతోంది.
ఈటీవీలో ప్రతి ఆదివారం, రాత్రి 9 గం.లకు ఒక గంట ప్రోగ్రాం ఉంటుంది – ‘చెప్పాలని ఉంది’ పేరున. మల్లేశం సినిమా స్ఫూర్తి చింతకింది గారితో పరిచయం ఇటీవల ప్రసారం చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూ నిర్వహించే ఆయన ‘ప్రకృతి’ అనే మాట పలకలేకపోవడం విచిత్రం. మదనపల్లె ప్రకృతి సేద్యం ప్రసాద్గారితో చేసిన పరిచయంలో ప్రకృతిపాట్లు బహుచిత్రం. వీరు తరచు ఈటీవీలో కనబడేవారే! మరి వీక్షకులు – పదంతో సహా బలయ్యారు. విజయనిర్మల గతించినపుడు రావు బాలసరస్వతిని పదేపదే చూపి కృష్ణగారి మొదటి భార్య అని టీవీ ఛానళ్ళు పదే పదే ప్రకటించి లోకువయ్యాయి. అలాగే రచయిత్రి ఓల్గాగారి అభిప్రాయం ప్రసారం చేస్తూ మరొకరి పేరు వేశారు ఈటీవీలోనే! ఇలాంటి పొరపాట్లకు ఏ ఛానల్ కూడా మినహాయింపు కాకపోవడం బాధారకం.
-నాగసూరి వేణుగోపాల్