ఎంతమంది గమనించారో కానీ ఇటీవల కాలంలో తుఫాన్లు సంభవించినపుడు ప్రాణనష్టం దాదాపు లేదు, ఆస్తినష్టం బాగా తగ్గింది. దీనికి వాతావరణాన్ని అంచనా వేయడంలో మన సాంకేతిక సామర్థ్యం బాగా పెరగడం ఒక కారణం. అయితే మనం చర్చించుకుంటున్నది రెండవ కారణం – అటువంటి సమయంలో టీవీన్యూస్ ఛానళ్ళు చేసే అప్రమత్త సమాచార ప్రసారం, హెచ్చరికలు వగైరా. నిజానికి టీవీన్యూస్ ఛానళ్ళ తీరుకు తుఫాను వంటి సందర్భం చక్కగా సరిపోతుందికూడా! ఆ తుఫాను తీరం దాటి శాంతించేదాకా ఈ ప్రసారాలు సాగుతాయి.
హైదరాబాదులో నవంబరు 27 రాత్రి జరిగిన మానభంగం, అత్యాచారం, హత్య దానికి సంబంధించి అభియోగం మోపబడ్డ ఆ నలుగురు చంపబడటం నేపథ్యంలో ఒక తెలుగు ఛానళ్ళే కాదు దేశవ్యాప్తంగా ఊగిపోతున్నాయి, ఉప్పెనలా సాగిపోతున్నాయి. పదిరోజులకు మించి అదే తీరు – దానికి మరోకారణం అలాంటి ఘటనల వార్తలు మరింతగా వార్తా స్థాయిని పొందడం. హత్య జరిగిన తర్వాత పార్లమెంటులో చర్చింపబడలేదు అంటూ ఆర్నబ్ గోస్వామి కేకలు వేస్తూ డిబేట్ నడిపారు. ఇది మరింతమంది ప్యానలిస్టులకు, మరిన్ని ఛానళ్ళకు కేకలు వేయడానికి ఇంకొంత అవకాశం కల్పించింది. ఆ నలుగురు తెల్లవారుజామున ఎన్ కౌంటర్ లో చంపబడ్డారనే వార్త వచ్చిన రోజు సాయంకాలం కూడా ఆర్నబ్ గోస్వామి అదేరీతిలో కేకలు వేస్తూ తను చాలా ఆనందపడుతున్నానని అరుస్తూ కార్యక్రమం నడిపించారు.
ఈ నేపథ్యంలో పరిశీలించాల్సిన విషయం ఏమిటంటే – ఇలా ఉద్రేకాలు పొంగినపుడుసామాజిక ప్రవర్తన (గుంపు మనస్తత్వం కారణంగా) వేరుగా ఉంటుంది. పదిహేనేళ్ళ క్రితం ఢిల్లీలో ఒక టీచర్ గురించి ఒక ఛానల్ స్క్రోలింగ్ వార్తలు వేసింది. అంతే కాసేపట్లో ఆ స్కూలు మీద రాళ్ళవర్షం లాంటిది సంభవించింది. అలాగే కార్గిల్ సమయంలో సరిహద్దు ప్రాంతంలో రిపోర్టు చేసే యాంకర్ తన మొబైల్ నుంచి ఫోను చేసింది ఎవరికో. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా శత్రువులని భావించబడి కాల్పులు జరిగాయి. ఫలితంగా మారణాయుధాలు ఆ యాంకర్ ఉన్న చోటుకి దగ్గర్లో పడ్డాయి. దాంతో చావుకి వెరవకుండా రిపోర్ట్ చేసింది మా ఛానల్ అంటూ సోత్కర్ష కథనాలు. బొంబాయిలో ఉగ్రవాదులు తాజ్ హోటల్ కాల్పులు జరిపినపుడు వెనక ముందు గమనించకుండా ప్రసారాలు చేయడం మనకు తెలిసిందే.
హైదరాబాదులో జరిగిన సంఘటనకు 2019 నవంబరు చివరివారం, డిసెంబరు తొలివారంలో ఛానళ్ళ తీరు ఒక మలుపుగా ఉండిపోతుంది. కెమెరా, మైకు పెట్టి ఊగిపోతూ వార్తలు ఇవ్వడం, చర్చ పెట్టి చట్టం, న్యాయం, రాజ్యాంగం, వ్యవస్థలు అంటూ కార్యక్రమాలు చేయడమే కాదు; అభియోగాలు మోపబడిన వారంతా ఇలానే కాల్చివేయబడాలని ఎవరికి వారు తీర్పులు ఇవ్వడం దీర్ఘకాలికంగా నిలువదు. రాజకీయనాయకుడు నారాయణ అభినందించి, ఇపుడు సర్దుకున్నారు. అజ్ఞానంతో, అవివేకంతో, కళ్ళు కప్పిన కామంతో, వ్యక్తి చేసే నేరం తీరు; ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగమవుతూ సత్వర న్యాయాన్ని అమలు చేయడంలో భాగంగా ఎన్ కౌంటర్ చేయడం వేరు. ఇది ఛానళ్ళ బయట ఉండే వ్యక్తులు గమనించాల్సిన విషయం.
తమ ప్రసారాలతో, కార్యక్రమాలతో మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామనేరీతిలో చర్చలు నిర్వహించే యాంకర్లూ; వారికి దిశానిర్దేశనం చేసే ఛానళ్ళ నిర్వాహకులూ గుర్తించాల్సింది ఏమిటంటే అది కేవలం టీవీ కార్యక్రమమే, టీఆర్పి కోసం నడిపే ప్రసారమే అని. ఎంపిక అయిన సామాన్య ప్రజలూ, ప్యానలిస్టులు మీరు భావించిన అభిప్రాయాలకు వత్తాసు పలికేవారే తప్పా మరొకరు కాదు. కనుక అన్ని ఛానళ్ళలో ఫ్యానలిస్టుల ఎంపిక ఎన్నో పరిమితులకు లోబడి ఉంది అని; అది పూర్తి ప్రజాస్వామ్యబద్ధం కాదని గుర్తించాలి. సమాజ ఉద్ధరణే లక్ష్యం, లోకశాంతి ఆదర్శం అయినపుడు ఈ చర్చలు జరుగుతున్నపుడు ‘90 ఎం ఎల్’ సినిమా ప్రకటన నిరంతరరాయంగా ఎందుకు కనబడుతుంది? ప్రైమ్ టైమ్ లో ఛానళ్ళు అన్నీ రేప్ ఖండన వార్తలలో మునిగిపోతే కొన్ని ఛానళ్ళు వార్తలు రద్దు చేసి ‘90 ఎం ఎల్’ మీదనో మరో సినిమా మీదనో అరగంట, పూర్తి గంట నిడివి చర్చాకార్యక్రమాలను ఎందుకు ప్రసారం చేస్తాయి? స్త్రీల హక్కులను ఎన్నో రకాలుగా అవమానించే సినిమారంగ ప్రతినిధులతో అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తే ఛానళ్ళ క్రెడిబిలిటి పెరుగుతుందా? లేదా చేసిన కార్యక్రమాల ఔచిత్యం మసకబారుతుందా?
చివరగా ఆర్నబ్ గోస్వామి గురించి మరో మాట. దశాబ్దం క్రితం ఈ రాజకీయనాయకులను, ఈ రాజకీయ వ్యవస్థను తిరస్కరించండి అంటూ కార్యక్రమంలో కేకలు వేశారు. ప్రత్యామ్నాయం గురించి మాట్లాడకుండా, దాని అవసరాన్ని గుర్తించకుండా ఆయన చేసిన హడావుడి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ నిచ్చిన ప్రజాస్వామ్యానికి మచ్చగా మారింది. ఆవేశమే కాదు, మరింత ఆలోచన కూడా కావాలి.
డా. నాగసూరి వేణుగోపాల్