పాఠ్యపుస్తకాలలో సతతహరితారణ్యాలు అనే మాట ఎదురైనపుడు అరణ్యాలు ఎలా పచ్చగా ఉంటాయి ? ఏదో ఒక కాలంలో ఎండిపోవాలి కదా ? అనే ప్రశ్నలు ఎదురయ్యేవి ఆలోచించినపుడు! సదా టీవీ న్యూస్ ఛానళ్ళు సంచలనాలు సృష్టించగలవు – అని పాతికేళ్ళ క్రితం భారతదేశంలో, ఇరవయ్యేళ్ళ క్రితం తెలుగు ప్రాంతంలో ఎవరూ నమ్మేవారు కాదు. కానీ ఇపుడు అనుభవం రీత్యా తప్పక ఒప్పుకుంటారు. మొత్తం బృందం చేసిన కృషికి చుక్కానిగా సినిమాను దర్శకుడు నడిపిస్తాడు. అయితే న్యూస్ టెలివిజన్ ప్రోగ్రాంలో యాంకర్ లేదా మోడరేటర్ ఆ పాత్ర పోషిస్తాడు. అందులో వైవిధ్యం సందర్భం బట్టి, ఇతర సానుకూలాంశాల బట్టి రూపు దిద్దుకుంటుంది. 2003లో మొదలైన తెలుగు న్యూస్ ఛానళ్ళలో తొలి దశాబ్దంలో మోడరేటర్లు కేకలు వేసిన దాఖలాలు లేవు.
ఇటీవల టీవీ-5 సాంబశివరావు, ఏపి 24 x 7 వెంకటకృష్ణ, 10 టీవీ ఈశ్వర్ ఇంకా మూర్తి వంటి వారు అపుడపుడు బాగానే కేకలు వేస్తున్నారు. టీవీ 9లో ప్రాచుర్యంలోకి వచ్చిన రవిప్రకాష్, దేవులపల్లి అమర్, కొమ్మినేని శ్రీనివాసరావుగార్లు, అరచిన సందర్భాలు కనబడవు. టీవీ-9 మొదలు కాకముందు రవిప్రకాష్ జెమిని సంస్థ ఛానల్ (కావచ్చు, లేదా వేరే ఛానల్ అయినా కావచ్చు)లో ఎన్ కౌంటర్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఘాటైన ప్రశ్నలు సూటిగా అడిగేవారు – అని అప్పట్లో సంచలనం. తెరవెనుక గుప్పుమన్న విషయం ఏమిటంటే అతిథి ఎదురుగా మామూలుగా, నవ్వుతూ అడిగి పిమ్మట ఉరుముతూ అడినట్టు రికార్డు చేసి, ఎడిటింగ్ చేసేవారని దానిని నేరుగా చూసిన పాత్రికేయులు చెప్పుకునేవారు. ఆయా అతిథులు దీని గురించి విబేధించిన సందర్భాలు, ఖండించిన సందర్భాలు లేవు గానీ – ఇది ఎథికల్ కాదు అని రవిప్రకాష్ ను కొందరు ఆయన అంతేవాసులు అనే వారు. ఇపుడు ప్రణయ్ రాయ్ వెళ్ళిపోయి ఆర్నాబ్ గోస్వాములు వచ్చిన కాలం. కేకలేస్తేనే కార్యక్రమం, అరిస్తేనే టీఆర్పీలు రాలు – అనే పరిస్థితి వచ్చింది.
దిశ మానభంగం, మృతి ఘటనలో పానలిస్టులు, పబ్లిక్ శృతిమించి కేకలు పెట్టడం, అరవడం, నిందించడం, తిట్టడంలో బూతులు వాడటం గమనించాం. రాజధాని వికేంద్రీకరణ విషయం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో రకరకాల వైవిధ్యం ప్రస్ఫుటమవుతోేంది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ముడిపడిన సంగతి కనుక చాలారకాల సరంజామా ఛానళ్ళకు అందుబాటులోకి వచ్చింది. సమస్య, సమస్య తీవ్రత, పలుకు, పదును తేడాలుండటంతో టీవీ మాధ్యమానికి పండుగ. ఇటీవల టీవీ-5 చర్చలో దబాయిస్తూ కార్యక్రమం నడిపే సాంబశివరావు రాయలసీమ గురించి అవాకులు, చవాకులు పేలారు. ఇది ఎలాంటిది అంటే – వి.వి.వినాయక్ అనే దర్శకుడు ఫాక్షన్ సినిమా అని చెబుతూ రాయలసీమ అంటూ పేర్కొన్నాడు. మీకు రాయలసీమ తెలియదు, ఎలా నిర్మిస్తారు అని అడిగిన ప్రశ్నకు సమరసింహారెడ్డి సినిమా చూశాను కదా అన్నట్టు జవాబు చెప్పారని అప్పట్లో వార్తలు చదివాను. ఇలాంటి పాండిత్యం ఆధారంగా సాంబశివరావు ఆ ప్రాంతం గురించి తనదైన జ్ఞానాన్ని ప్రదర్శించి విమర్శల పాలయ్యారు.
టీఆర్ పీలే పాలసీగా సాగుతున్నాయి కనుక ఇలాంటి బుద్ధితక్కువ విశ్లేషణలు వస్తాయి. కొంతకాలం క్రితం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉత్తరాంధ్ర మాటతీరుపై, వారి మేథోస్థాయి గురించి అర్థరహితంగా కార్యక్రమం మధ్యలో మాట్లాడి విమర్శలకు గురయ్యారు.
ఇందులో ఛానళ్ళ పాలసీతోపాటు మోడరేటర్ల వైయుక్తిక చిరునామాలు, వాసనలు గుప్పుమంటున్నాయి. సాంబశివరావు వాదనకు విరుగుడన్నట్టు 10 టీవీ ఈశ్వర్ మాట్లాడిన విషయాలు కూడా ఇరువర్గాలను ఆకర్షిస్తున్నాయి. ఈ రెండు కార్యక్రమాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ధోరణులకు ఆయా ఛానళ్ళ యాజమాన్యాల అవసరాలూ; ఆయా ఛానళ్ళ ఎడిటోరియల్ భావనలూ మిళితం అయ్యాయా, లేదా అనేవి కూడా మరింత లోతుగా పరిశీలించదగిన అంశాలు !
ఇది ఇలా ఉండగా ఢిల్లీ నుంచి శేఖర్ గుప్తా సోషల్ మీడియాలో అమరావతి గురించి చెప్పిన విషయాలు తెలుగు ఛానళ్ళలో మరో అంకం. దీని గురించి మరో సందర్భంలో చెప్పుకోవాలి!
డా. నాగసూరి వేణుగోపాల్