తెలుగు జర్నలిస్టుకు ఇక నిష్పాక్షికత అంటే బోధపడక పోవచ్చు అని ఐదారు సంవత్సరాల క్రితం ఒక మీడియా ఎక్స్పర్ట్ అన్నారు. మరి ఇప్పటి పరిస్థితి ఏమిటి? ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి అటు రాజకీయ పార్టీలకూ, ఇటు టివి ఛానళ్లకూ మరింత వేడి పుట్టించాలనే తాపత్రయం పెరుగుతూ పోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా టివి5 ఛానల్ చర్చల్లో పాల్గొనరాదని నిర్ణయించింది. అంతకు ముందే చాలాకాలం క్రితం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో పాల్గనబోమని ప్రకటించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాక్షి విలేఖరి ప్రశ్నకు జవాబు ఇవ్వనని గదమాయిస్తూ చెప్పారు. ఈ ధోరణి కొత్తేం కాదు. అపుడపుడూ చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తోంది?
ఈ శనివారం (మార్చి 10) ఎన్టివి అనంతపురంలో బిగ్ఫైట్ చర్చ లైవ్ ఇస్తోంది. యాంకర్ దేవి కాంగ్రెస్, బిజెపి మోసం చేశాయనే రీతిలో రెండు సార్లు ప్రశ్న వేశారు. ఈ మాటలు వ్యతిరేక రాజకీయ పక్షాలు అనవచ్చు. చక్కని కారణాలతో విశ్లేషించవచ్చు. ఇక్కడ ఒక్క ఎన్టివి పేరు చెప్పడానికి కారణం ఏమిటంటే తాజా ఉదాహరణ చెప్పాలనే. నిజానికి టివి5 సాంబశివరావు, ఎపి 25X7 వెంకటకృష్ణ, టివి9 రజనీకాంత్, ఇలా చాలాపేర్లు చెప్పవచ్చు. యాజమాన్యాలు నిర్ణయించిన రీతిలో తయారయిన ప్రశ్నలు ముక్కున పట్టి చర్చ సాగతీస్తారు. తాము ఆశించిన కోణంలో కాకుండా మరో రీతిలో నడిస్తే, యాంకర్ అడ్డుపడి మరో విషయానికి వెళతాడు. ఆ మధ్య టివి9లో కెఎ పాల్తో లైవ్ నడుస్తోంది. టివిల్లో కార్యక్రమానికి డబ్బులు ఇస్తారన్నట్లు పాల్ చెప్పబోతే యాంకర్ అడ్డుకుని మీరెంత ఇచ్చారు అని బిగ్గరగా ప్రశ్మించారు. ‘పాపం పాల్’ అని అనుకునేలోపే ట్విస్ట్ పెద్ద ఆశ్చర్యాన్ని మిగిల్చింది. ‘అవన్నీ పెయిడ్ ప్రోగ్రామ్స్ వారికి అందుకే అన్ని ప్రోగ్రామ్స్ అని మీరే చెప్పారుగా’ అని పాల్ అడిగిన ప్రశ్నకు జవాబు లేదు. చర్చ మరో వేపు వెళ్లింది.
రాజకీయపార్టీలు తాము ఫలానా వారికి వ్యతిరేకం అని చెప్పకోవచ్చు. కానీ ప్రజల పక్షం అని చెప్పుకునే మీడియా ఇలా బాహాటంగా చొక్కాలు విప్పుకుని విజృంభించడం మరీ ఎక్కువయింది. నిజానికి ఇది ఒకరకంగా కొత్త కాదేమో. ఈనాడు దినపత్రిక తాము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అని తొలిపేజీలో యజమాని సంతకంతో ప్రకటించి చాలా కాలమయింది. ఇప్పుడు వాఖ్యాత ఏ దిశలో సాగుతున్నదీ జనం స్పష్టంగా చెప్పగలరు. ఒకే పత్రిక చదివేరువారు ఉండవచ్చు కానీ ఒకే ఛానల్ చూసేవారు ఎవరూ ఉండరు. అతి భక్తితో ఎవరైనా ఒకే ఛానల్ చూడాలని ప్రయత్నించినా, ప్రకటనదార్లు మధ్యన వచ్చి ఇదే ఛానల్ చూస్తే ఎలా, మరో ఛానల్ కూడా చూడండి అని తరుముతారు. దాంతో మరో ఛానల్ వాలకం కూడా తెలుస్తుంది. వారి గుడ్డలు వీరు తొలగిస్తే వీరి బట్టలు వారు వలుస్తారు. ఈ సౌకర్యం టెక్నాలజీతో ఒనగుడిన వెసులుబాటు. కనుక ప్రజలు కూడా అన్నీ తెలుసుకోవడానికి అలవాటు పడ్డారు. పత్రికల్లో అయితే కాస్త లాఘవంగా మెలిపెట్టి రాసే అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చిగా దొరకరు. అదే న్యూస్ ఛానళ్లలో అయితే అంతా లైవ్ కనుక అంత మార్మికత సాధ్యపడదు. కనుక నిర్లజ్జగా సాగుతున్నట్లు ధృవపడుతుంది. నిజానికి పత్రికల యజమానులు అంతర్లీనంగా సాయం చేసి రాజ్యసభ సభ్యత్వం పొందిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు కూడా ఈ స్థాయి విమర్శలు లేవు. ఇప్పుడంతా పారదర్శకమే, పరమ మాలిన్యమే.
తమిళనాడులో ప్రతి రాజకీయ పార్టీకి ఛానల్ ఉంది. తాము వ్యతిరేకించే పార్టీ వారి ఛానల్కు వెళ్లరు. వారిని తమ ఛానల్కు ఆహ్వానించరు. ఎవరి గోల వారిది. జనాలు కూడా ఏది కావాలంటే ఆ ఛానల్ చూసుకోవచ్చు. దీనితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సుహృద్భావ వాతావరణం ఉందని నాలాంటి విశ్లేషకులు పదేళ్ల క్రితం భావించి అభినందించేవారు. కానీ నేడు తెలుగు న్యూస్ ఛానళ్లు తమిళ న్యూస్ ఛానళ్ల దిశలో సాగుతున్నాయనిపిస్తోంది. ఇది ఆపడం ఎవరి తరం కాకపోవచ్చు. అలాగే టివీ ఛానళ్లలో రాజకీయ మొగ్గు విపరీతంగా పెరిగి యాంకర్లు అడ్డు తగలడం, అరవడం బాగా పెరిగింది. ఒకరకంగా రాజకీయ నాయకులు అతిధులం కదా అని సర్దుకుని మృదువుగా ఉంటున్నారు. అయితే అడ్డగోలుగా అరిస్తే ఎక్కువ సమయం ఇస్తారని తెలుసుకున్న నాయకులు వ్యతిరేక పార్టీపై కేకలు పెడతారు. ఒకాయన ‘ఊరుకోకపోతే ఉరేసుకో’ అనడం, ‘అంత మాట అంటావా సన్యాసీ’ వంటి మాటలు వాడడం ఘోరంగా ఉంది. జనాలు టీవీ సీరియళ్లలో చూసి అలవాటు పడిన వినోదం చూస్తున్నారు. ఆరోగ్యం, అనారోగ్యం అని మనం చెప్పుకున్నా చర్చించుకున్నా- ఛానళ్లకు టీఆర్పీయో, అంతకు మించి అంతర్గత అవసరాలో ప్రధానం కనుక వారు తాము వెళ్లే దారిలోనే వెళతారు. తెలంగాణాలో ఇపుడు ఛానళ్లు కిక్కురుమనకుండా తాము మంచి బాలురు అనే వార్తలు చూపిస్తున్నారు. కనుక ఛానళ్ల తీరును పరిశీలిస్తే ఇంటర్నల్ డైనమిక్స్ పూర్తిగా విభిన్నం, అత్యంత కీలకం అని బోధపడుతుంది.
డా. నాగసూరి వేణుగోపాల్