మొదటి విడత పోలింగ్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. కాస్త టివి కాలుష్యం తగ్గుతుందని ఎందరో భావించారు, ఆనందించారు. ఈ అంచనాలు తప్పని ఛానళ్లు రుజువు చేస్తున్నాయి. పోలింగ్కు సంబంధించిన దౌష్ట్యం, హింస వివాదాలు వార్తలలో స్థానం ఆక్రమించి సాగుతున్నాయి. ఒక పార్టీ చేసిన అన్యాయం, అప్రజాస్వామిక చర్యలు, అంటూ ఒక ఛానల్లో విజువల్స్ పదేపదే చూపుతూ, వాయిస్ ఓవర్ గద్దిస్తూ ఉంటుంది. మరో పార్టీ చేసిన మోసం, ధాష్టీకం అంటూ ఇంకో ఛానల్ అదే దృశ్యాలను అదే భావాలను మరోలా మరోలా చెబుతూ సాగుతుంటుంది. నిజానికి ఆయా పార్టీల మనుషులు కూడా ఇలా నేరుగా పూసుకుని మాట్లాడరేమో అనిపిస్తుంది. పోలింగ్ ముందు ఆలవాటు పడిన రీతిలో హెచ్చు టిఆర్పిల హడావుడి కొనసాగాలని ఛానళ్లు భావిస్తున్నాయా?
ఇంకో రకమైన పోకడ మరోటి ఉంది. న్యూస్ ఛానళ్లకు ఆజ్యం పోయడానికి పత్రికలూ, పత్రికలకు ముడిసరుకుగా ఛానళ్లు అనేది పాతవిషయం. ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీలకూ ఛానళ్లు, పత్రికలూ ఉన్నాయి. ఈ పరస్పర వ్యవహారాలు ఆయా మీడియా యాజమాన్యాల చేతిలో లేదా పార్టీల కనుసన్నల్లో ఉంటాయి. ఖర్చు లేకుండా ఎవరో చేసిన లైవ్ ఏర్పాట్ల సాయంతో ప్రత్యక్ష ప్రసారాలు సాగుతాయి. గంటల తరబడి ప్రకటనల విరామంలో పక్క ఛానల్కూ ఆతర్వాత చెట్టు మీద కోతిలా రిమోట్ ద్వారా మనం చూసే ఛానల్ మారిపోతూ ఉంటుంది. కనుక ఏ ఛానల్లో ఏం చూశామో గుర్తుండదు. ప్రత్యక్ష ప్రసారాల్లో సోది ఎక్కువ, సరుకు తక్కువ. ఈ లోటు భర్తీ చేయడానికీ, వీక్షకులకు బీపి పెంచడానికీ అన్నట్లు వాట్సాప్, ఫేస్బుక్ల్లో రకరకాల షార్ట్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వార్తా ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాల్లో మిస్సయిన ‘రంజు’ ఈ దారి ద్వారా అరచేతిలో ఇమిడి పోతుంది.
ఎబిఎన్లో లైవ్ ముందు జరిగిన సంభాషణ అంటూ గిరికీలు తిరిగిన చంద్రబాబు – రాధాకృష్ణ వీడియో కావాల్సినంత సంచలనం రేపింది. అలాగే మార్ఫ్డ్ ఆడియోనో మరోటో గానీ – ఇలాంటి ఆడియోల తయారీదారూ, ఆ పని ఇచ్చిన దళారీ మధ్య సాగిన సంభాషణ అంటూ నడిచే ఆడియో కూడా అరచేతి మాధ్యమం ద్వారా మరింత గందరగోళం కల్గిసోంది. ఏది సిసలైందో, ఏది దొంగదో అర్ధం కాని వ్యవహారం. అయితే నిజం అబద్ధం మధ్య అయోమయంగా సాగే సమాచార స్రవంతుల నడుమ ఏది చెప్పినా జనం – ఆ క్షణంలో తప్పక నమ్మేట్లు ఉన్నారు. కాసేపు తర్వాత మరో ఛానల్లో మరో మార్గంలో భిన్నమైన సమాచారం రావచ్చు. కానీ అంతవరకూ ఏమిటి? జర్నలిస్టులే తటస్థ ఆలోచన, సామాజిక ప్రయోజనాల పోకడా అనేవి మరచిపోయిన తెలుగు నేలలో సగటు టివి ప్రేక్షకుడికి టన్నుల కొద్దీ ఇంగితం ఎక్కడ నుంచి వస్తుంది? తాను ఎలా వడబోసి చూడగలడు? అందువల్ల పత్రికలూ, ఛానళ్ల కారణంగా పోలరైజ్ అయిన మొగ్గు, అసహనం, అహేతువులు ఈ పార్టీ వీడియోల కారణంగా మరింత బలపడుతున్నాయి. ఏది ఎక్కవ చూడబడితే అదే మరింత ఎక్కువ చూడబడుతుంది.
టివి న్యూస్ ఛానళ్లకూ, సినిమాలకూ బాదరాయణ సంబంధం మరింత బలపడుతోంది.కథానాయకుడు, దాన్ని మించి మహానాయకుడు చెట్టెక్కాయి; ఉద్దేశించిన పార్టీకి పెద్ద ప్రయోజనం కల్గించలేకపోయాయి. మరో వైపు యాత్ర సినిమా ఎన్నికల కమిషన్ అనుమతితో విడుదలై అందరూ భావించినట్లుగా ఆ పార్టీకి ఎంతో కొంత లబ్ది చేకూర్చిందేమో! మరోవైపు రాంగోపాల్ వర్మ సినిమా తెలంగాణాలో విడుదలై, ఆంధ్రప్రదేశ్లో వాయిదా పడి ఇరువర్గాలకూ కొంత ఊరట కొంత అసంతృప్తి మిగిల్చింది. ఇదిలా ఉంటే మోదీ బయోపిక్, నమో ఛానల్ అర్ధంతరంగా ఆగిపోయాయి. ఈ విషయాల మీద క్రమం తప్పకుండా టివి ఛానళ్లు చర్చిస్తూనే ఉన్నాయి.
ఇలా ఈ పలురకాల కాలుష్యానికి కారణంగా ఒక చోట, ఆజ్యంగా మరో చోటా ద్విపాత్రాభనయం చేస్తోంది టివి న్యూస్ ఛానల్ మాధ్యమం. ఎన్నికల ముందు మూడు నెలల ముచ్చటగా మొదలైన తొలి న్యూస్ ఛానల్ తర్వాత కొనసాగడమే కాదు, బోలెడు న్యూస్ ఛానళ్లకు ప్రేరేపకం అయింది. అదే రీతిలో పోలింగ్కు ముందు నెల రోజులుగా సాగిన న్యూస్ కాలుష్యం అదే రీతిలో తెలుగునాట సాగక తప్పదా! ఇది భయంకరమైన ఆందోళన.
పోలింగ్ తర్వాత శనివారం ఉదయం సాక్షి టివిలో ప్రసారమైన విజయవాడ వైఎస్ఆర్సిపి అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ ప్రకటన గమనార్హం. పోలింగ్ ముందు, ప్రచారకాలంలో అర్ధరహితంగా, అసంబద్ధంగా తన మీద వార్తాంశాలను రూపొందించి ప్రసారం చేసిన మహాటివి. టివి5 ఛానళ్లపై పరువునష్టం దావా వేస్తున్నట్లూ, చట్టబద్ధంగా పోరాడబోతున్నట్లూ ప్రకటించారు. తెలంగాణాలో కనబడనంత వార్తల, వ్యాఖ్యల విశృంఖలత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కొన్ని తెలుగు న్యూస్ ఛానళ్లలో కననబడుతోంది. ఈ కాలుష్యంలో పడిపోయిన పౌరులు తమకు ఏమి కావాలో, రాజకీయపార్టీలు ప్రభుత్వం ద్వారా ఏమి చేయాలో మరిచిపోయినా ఆశ్యర్యం లేదు!!
-నాగసూరి వేణుగోపాల్