రేపు ఒక సినిమా విడుదలవుతోంది అనుకుందాం. అది ఏదో వివాదాల్లో చిక్కుకుంది. చివరకు సినిమా పేరు మారింది. “మా సినిమా పేరు మారింది… ఇది గమనించండి. పేరు మారింది… మీ మిత్రులకు చెప్పండి. సినిమా విజయవంతం చేయండి… ప్లీజ్” అన్నట్టు ఆ సినిమా దర్శకుడు నిర్వహించిన ప్రెస్ మీట్ సంగతులను దినపత్రికలో తొలి పేజీలో న్యూస్ ఐటమ్ గా చూడగలమా? ఊహించలేము దినపత్రికలలో! కానీ టెలివిజన్ మాధ్యమంలో సాధ్యం. ‘వాల్మీకి’ అనే పేరుతో రావల్సిన సినిమా ‘గద్దలకొండ గణేష్’ గా సెప్టెంబరు 20న విడుదలయ్యింది. సెప్టెంబరు 19వ తేదీ గురువారం రాత్రి పదింబావుకు ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్’లో ఆ డైరెక్టర్ ప్రెస్ మీట్ ప్రత్యక్షప్రసారం అయ్యింది. ఓ ఏడెనిమిది గంటలలో విడుదలయ్యే సినిమా గురించి మిగతా వార్తలు రద్దు చేసి, రాత్రి పది తర్వాత ప్రెస్ మీట్ లైవ్ ఇవ్వడం ఏమిటి? ఈ కార్యక్రమం కోసమే ఆ లైవ్ కానీ, లేకపోతే రాత్రి 10.15కు ప్రెస్ మీట్ ఏమిటి? దీనికోసం వార్తల రద్దు జర్నలిజమా? లేదా పైకి చెప్పని సినిమా ప్రకటనా? వీటిని ఎవరూ పట్టించుకోరు. సినిమా వచ్చింది, పోయింది. చివరకు ఈ టీవీ ఇలాంటి పనిచేసిందనే అపఖ్యాతి. వార్తాపత్రికలలో అయితే ఇలాంటి పని చేయడానికి స్థిరపడిన సంప్రదాయాలు అడ్డుపడతాయి. ప్రపంచీకరణతో ప్రవేశించిన టెలివిజన్లో ఉండే సౌలభ్యమే అది! అంటే స్వాములు, బాబాలు, జ్యోతిష్యం, వైద్యం వంటి అరగంట/పావుగంట కార్యక్రమాలు వాటి ప్రకటనలుంటే ఎంతటి వార్త అయినా తెరమరుగు కావాల్సిందే! ఇది ఇండియన్ టెలివిజన్ వీక్షకులకు స్థిరపరచిన ప్రతిబంధం. గట్టి చట్టం ఏదో వచ్చి నియంత్రిస్తే తప్ప పరిష్కారం ఉండకపోవచ్చు.
అలాగే మన బుల్లితెరకు ఇంకో సమస్య ఉంది. ఒకే వార్తను ఎక్కువ ఛానళ్ళు ఎక్కువసేపు చూపడం, పదే పదే చూపడం. ఇటీవల చంద్రయాన్, బోటు ప్రమాదం, కోడెల శివప్రసాద్ ఆత్మహత్య, ఆత్మకూరు ఛలో వంటి వార్తా సంఘటనలపుడు అదే వార్తను పదే పదే, వరుసగా చూపడం; రోజంతా దాన్ని పట్టుకునే వార్తా ఛానళ్ళు సాగడం చాలా ఇబ్బందిగా ఉంటున్నది. ఆత్మకూరు ఛలో – రాజకీయ వార్తలు ఇష్టపడేవారికీ, లేదా ఆ ప్రాంతపు వారికీ లేదా ఇంకెవరికైనా ఆసక్తి ఉండవచ్చు. మిగతావారి మాటేమిటి? మిగతావార్తల మాటేమిటి?? దాన్నే చూస్తారని న్యూస్ ఛానళ్ళు, సంపాదక వర్గాలు భావించడం లేదా పోటీ ఛానల్లో చూపుతారని సదరు ఛానల్ పరిగణించడం జరగవచ్చు. దాంతో మిగతా వార్తలకు పాతరేయాలా? నిజానికి ఎక్కువ ఛానళ్ళు వస్తే ఎక్కువ జనాభాకు చెందిన విషయాలు ఇతరుల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి రావాలి. ఇదీ వైవిధ్యంలోవి సౌందర్యం. అలాకాక ఎక్కువ ఛానళ్ళు వస్తే తక్కువ వార్తలు వస్తాయనే నియమం వైపు ఈ వార్తా ఛానళ్ళు లాగుతున్నాయి. ఇది తెలుగుకే ప్రత్యేకమా? ఇతర ఛానళ్ళలో కూడా ఇలానే ఉందా గమనించాలి. వైవిధ్యం కోల్పోయి వార్తా ధృవీకరణం కావడం ఏమాత్రం వాంఛనీయం కాదు, ఆరోగ్యకరం కాదు. దీనికి కూడా పరిష్కారం అంత సులువుగా లభించకపోవచ్చు. మొత్తం టీవీ ఛానళ్ళనే ఇటువంటి వేళల్లో వీక్షకులు చూడకపోతే ఏమైనా ఫలితముండవచ్చు.
మీడియా విషయాలు అపుడపుడు మీడియా పండితులకు కూడా బోధపడవు, ఆశ్చర్యం కలిగిస్తాయి. జగన్మోహనరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కంపెనీ అయిన భారతీ సిమెంట్ ప్రకటనలు ఆయనను తీవ్రంగా విమర్శించే వార్తలను ఎక్కువ ప్రసారం చేసే ఛానళ్ళలో కూడా కనబడేవి. ఇది చాలాకాలం గమనించాం. ఒక ఛానల్ కూడా కాదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో పాలుపోదు. ఆదివారం రాత్రి చిరంజీవి సినిమా ‘సైరా’ ప్రీ రిలీజ్ షో లైవ్ సాక్షిలో ప్రసారం కావడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఆయన కాంగ్రెస్ నాయకుడు. తమ్ముడికి సంబంధించి 99టివి ఛానల్ ఉంది. వైకాపాని వ్యతిరేకించే ఛానళ్ళు కొన్ని ఉన్నాయి. ఇది కొందరు చేసే విశ్లేషణ. కానీ జరిగింది వేరు. దీనికి ఎవరి వ్యాఖ్యానం ఏదైనా వేచి చూడక తప్పదు.
-డా. నాగసూరి వేణుగోపాల్