ఒక మూడు రోజులుపాటు చంద్రయాన్ వార్త, అంతకు ముందు రెండు రోజులు 74 ఏళ్ళ వయసులో కవలలకు జన్మనిచ్చిన తల్లి సమాచారం మన టీవీ ఛానళ్ళను ఆక్రమించివేశాయి. రెండూ విజ్ఞాన సంబంధమైన అంశాలే! అదే సమయంలో సోషల్ మీడియా, టీవీ మీడియా ఒకే స్థాయిలో ఉన్నాయనిపించేలా ఉన్నాయా అనే సందేహం బాగా కల్గింది ఈ వార్తల తీరును గురించి ఆలోచించినపుడు!
బిగ్ బాస్ కార్యక్రమం మా టీవీలో వస్తోంది. దానిగురించి మనం చర్చించాలా వద్దా? లెక్కప్రకారం అయితే అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కనుక ఈ కాలమ్లో మాట్లాడక్కరలేదు. అయితే అలా సాధ్యపడటం లేదు. ఎన్ టీవీలో, సాక్షి టీవీలో ఉదయం 11.30కో లేదా 12.30కో అరగంట కార్యక్రమాలు తరచు యిస్తున్నారు. అవి కార్యక్రమాలో, ప్రకటనలో కూడా చెప్పలేము. శ్వేతారెడ్డి, గాయత్రీ గుప్తాగార్లు ‘బిగ్ బాస్’ కార్యక్రమం ముందు వార్తలలో ఉన్నారు. ఇప్పుడు ఆచూకీ లేరు. నిజానికి మన టీవీ ఛానళ్ళు ఈ విషయం ఏమైంది అని ఇపుడు వార్తా శోధన చేయాలి. ఇలా కాక ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రమోషనల్ సరంజామాను కార్యక్రమాలుగా ప్రసారం చేస్తున్నారు. ఇంత ప్రసార సమయం కేటాయించడం అంటే అది ప్రకటనగానే పరిగణించాలి. హోస్టు నాగార్జున పుట్టినరోజు సంబంరం కోసం విదేశాలకు వెడితే, వారం రోజులపాటు రమ్యకృష్ణను గెస్టు హోస్టుగా కార్యక్రమం నడిపించారు. తెలుగు సరిగా మాట్లాడలేని తమిళనాయికను హోస్టుగా ఒక వారంపాటు ఆహ్వానించడం ఏమిటో? బిగ్ బాస్ సీజన్ 3 సగం వూర్తి అయ్యింది. కనుక సీజన్ 2 హోస్టు నానిని గెస్టుగా ఆహ్వానించారు. అది ఆయన రాబోయే సినిమా ‘గ్యాంగ్ లీడర్’కు ప్రమోషన్. ఇలా పరస్పరం ప్రమోషన్ల మీద నడుస్తోంది బిగ్ బాస్ కార్యక్రమం.
అచ్చు అక్షరం, రేడియోలో మాట, టీవీలో వార్త – అంటే ఒక గౌరవం, ఒక నమ్మకం ఉండేవి. టీవీ ఛానళ్ళు విపరీతంగా రావడం, వార్తా ఛానళ్ళు అయినదానికీ కానిదానికీ లైవ్ ప్రోగ్రాంలు అనడంతో టీవీ వాచాలత్వం ఏమిటోగా ఉంది. రంగురాళ్ళు, రేకులు, తాయెత్తులు గురించి కార్యక్రమాలు ప్రకటనలుగా ఇస్తూ అపుడపుడూ జ్యోతిష్యం మీద దాడి చేస్తూ, దేవుడిని ఖండిస్తూ కార్యక్రమాలు చేయడం ఒక టీవీలోనే సాధ్యమవుతోంది.
74 ఏళ్ళ వయసులో కవలలకు జననం ప్రపంచ వైద్యచరిత్రలో అరుదైన కాన్పు – అని ఒక తెలుగు పత్రిక యిస్తే, ఇంకో ఆంగ్ల దినపత్రిక ఇలా రాసింది; At 74, Telugu women becomes the oldest – ever to give birth Mangayamma delivered twin babies in Guntur. ఇది సమాచారం, ఇది విశేషం, ఇది వార్త. ఆ వయసులో కాన్పు. అది వైద్య విశేషం. ఆవిడ ఆశ, ఆకాంక్ష, శరీర పటుత్వం. బామ్మ, అమ్మ అనే రెండు పదాలతో పత్రికలు శీర్షికలు పెట్టడం; అంతకు ముందురోజు నుంచి సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానించడం. ఈ రెండింటి మధ్య కూడలిగా టీవీ మీడియా నిలుస్తోంది. ఈ సందడి నడుస్తున్న వేళ ఒక పోస్టు ఫేస్బుక్ లో కనబడింది. అక్రమ గనుల తవ్వకాలు కాదు! గనుల అక్రమ తవ్వకాలు అనాలి అని ఎన్ టీవీ హెడ్డింగ్ గురించి. మూడే పదాలు – అయితే రెండు పదాల క్రమంలో తేడా రావడంతో అర్థాలు మారిపోతున్నాయి. అసలు తమని తాము గమనించే వెసులుబాటు, ఓపిక, ఆసక్తీ మన టీవీ మీడియాలో ఉన్నాయా?
చంద్రయాన్ గురించి హడావుడి, విమర్శలు, జోకులు ఏమిటో? ఇందులో పరిశోధన మూడు రకాలుగా ఉంటుంది. చంద్రుడి చుట్టూ తిరిగేది ఆర్బిటార్. ఇది ముప్పయి పై చిలుకు వివరాలను సేకరిస్తుంది. చంద్రుని మీద దిగింది ల్యాండర్. ఇది ఇంకొన్ని వివరాలను సేకరిస్తుంది. దీని నుంచి విడిపోయిన బండివంటి రోవర్ మరికొన్ని వివరాలు సేకరిస్తుంది. ఇవేవి గమనించకుండా అవాకులు చవాకులు పేలడాలు ఎందుకు? చివరకు రోవర్ విక్రమ్ ఆచూకీ తేలింది. ఇపుడు నాసా శాస్త్రవేత్తలు మనతో చేయి కలపడానికి సిద్ధం అయ్యారు. చంద్రయాన్-I కూడా మిగతా ప్రపంచదేశాల పరిశోధనలు తేల్చిన దానికన్నా మిన్నగా చంద్రగ్రహంపై నీరు వుండే అవకాశం ఉందని ధ్రువపరిచింది. అందువల్లనే ఈసారి చంద్రుడి దక్షిణధ్రువం వైపు మన ప్రయోగాలు జరుగుతున్నాయి. అసలు విషయం తెలుసుకోకుండా అన్నింటినీ ఒకేలా, ఒకే రకంగా వ్యాఖ్యానించే మీడియా మహాశయులకు ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి?
డా. నాగసూరి వేణుగోపాల్