దసరా సమయంలో, బతుకమ్మ సంబరాల వేళ ఈవార్త వస్తుందని టీవీ ఛానళ్ళను విమర్శించే వారు సైతం గమనించలేదు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అన్ని ఛానళ్ళు అరగంట ప్రకటనా కార్యక్రమాలతో రిలాక్స్ అవుతున్నాయి. సరిగ్గా ఆ సమయం రవిప్రకాష్ అరెస్ట్ అని సోషల్ మీడియాలో హడావుడి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి లేదా నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి టీవీ ఛానళ్ళను సంప్రదించక తప్పదు. అన్ని ఛానళ్ళలో వార్తలు లేవు, కార్యక్రమాలు లేవు, కేవలం అరగంట వ్యవధి ప్రకటనా కార్యక్రమాలు. కొన్నింటిలో స్క్రోలింగుల్లో పోలీసు అదుపులో అంటూ సమాచారం. కొత్త యాజమాన్యం వచ్చాక సుమారు 18 కోట్ల రూపాయల దాకా రవిప్రకాష్, మూర్తిగార్లు స్వాహా చేశారని అభియోగం. ఇందులో కూడా పెరీరా పేరుతో 6 కోట్లు, తన పేరుతో 6 కోట్లు మాయం చేశారని సమాచారం. రాత్రికి చంచల్ గూడా జైలుకు తరలించి సాధారణ ఖైదీగా (నెం.4412) పంపారని విశేషం. ఆయన వార్తల్లో వ్యక్తి కనుక ఖైదీ నెంబరు, తినని కిచిడి, కృష్ణాబ్యారక్, ముభావం అన్న సమాచారాలు కూడా వచ్చాయి.
అంతా సద్దు మణిగింది. ఆయన ఏదో ఛానల్ కు సమాయత్తమవుతున్నాడు. మై హోం యాజమాన్యం కూడా పట్టు సడలించింది – అనే గ్యాసిప్ తారట్లాడుతున్న సమయంలో ఈ వార్త వచ్చింది. అయితే ఈసారి ఏ వార్తా ఛానల్ కూడా ఉత్సాహపడలేదు, ఉరకలు వేయలేదు. కాస్త నిదానంగా, మితంగా వార్తలు ఇచ్చాయి. వాటిలో మెరుగైన సమాజం కోసం అరెస్టు అనే నామకరణాలు లేకపోలేదు. సుమారు దశాబ్దం క్రితం ఒక మాసపత్రిక సంపాదకుడు రమణమూర్తి స్నేహితుడిని హత్య చేయించాడన్న వార్త తర్వాత బహుశా ఈ వార్త మాత్రమే అంతకు మించి సంచలనం కలిగించింది.
రవిప్రకాష్ వార్తలు ఇట్లా ఉండగా; హైదరాబాదులో ఈఎస్ఐ స్కామ్ వివరాలు నెమ్మదిగా వస్తున్నాయి, అరెస్టులవుతున్నాయి. అయితే ఈ స్కామ్ లో పాలుపంచుకున్న జర్నలిస్టు ఎవరో, ఆయన పనిచేసే ఛానల్ ఏదో ఇంకా బయటికి రాలేదు.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వీధీపోరాటాల స్థాయి నుంచీ సోషల్ మీడియా పోస్టింగుల పోరాటాల దాకా దిగజారాయి. వీటిని ఖండిస్తూ ప్రతిపక్ష నాయకుడు గంటకు మించి మాట్లాడటం, దీనిపై టీవీ న్యూస్ మీడియా గంటల తరబడి చర్చలు పెట్టడం ఒక అంశం కాగా; సోషల్ మీడియాను కంట్రోలు చేయాలని యాంకర్లు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా ప్రశ్నలు వేయడం గమనార్హం. శృతిమించిన తర్వాత, గతి తప్పాక ఎక్కడికి వెడతామో తెలీదు. అమెరికా ప్రెసిడెంట్ ‘ట్రంప్’ను టీవీ ఛానల్ థర్డ్ పర్సన్ సింగులర్ లో వాడాల్సిన అగత్యం ఏమిటి? అమెరికా వారు తమ ఛానల్ చూడరనే నమ్మకం ఎక్కువ ఉండవచ్చు. వార్తల్లో వ్యంగ్యమో తెలీని మాస్ మల్లన్న, గోలీమార్ లలో ఇలాంటి పనులు జరుగుతుంటాయి.
ఆదివారం రాత్రి ఛానళ్ళు అన్నీ బతుకమ్మ సంబరాల ప్రత్యక్ష ప్రసారాలతో సేదదీరుతున్న వేళ్ళ టీవీ 5 మానవాసక్తికర కథనం ఒకదాన్ని వివరంగా ప్రసారం చేసింది. ఒరిస్సా సరిహద్దు నుంచి ఆవులు, ఎద్దుల్ని కబేళాకు హీనంగా తరలిస్తున్నారని ఆ వార్త. ఏ రకంగా హింసిస్తున్నారో, చట్టవ్యతిరేకంగా ఏం చేస్తున్నారో చాలా వివరంగా, దృశ్య సహితంగా వార్త సాగింది. మామూలుగా టీవీ ఛానళ్ళను చూస్తూ మార్చుకోవడమే కానీ ఆగి చూడటం ఉండదు. అయితే ఈ వార్త ఆ పనిని విజయవంతంగా చేయించింది. ఈ వార్తను పంపిన జర్నలిస్టుకు దాన్ని ఎంపిక చేసిన ఎడిటర్కు అభినందనలు చెప్పాలి. అలాంటిదే మరోటి టీవీ 9లో కుప్పం ప్రాంతంలో కాన్సర్ వార్త – వక్కాకు తినడంవల్ల నోటి కాన్సర్ విపరీతంగా వస్తోందని వివరంగా చేసిన కథనం ‘అనగనగా’ ఒక ఊరులో ప్రసారమైంది. గతవారం కొండగట్టు ప్రమాద బాధితుల గురించి ప్రసారం చేశారు.
వారం వారం టీవీక్షణంలో కలుసుకుందాం, టీవీ కార్యక్రమాల మంచిచెడ్డలు ఉదాహరణలతో విప్పి చెప్పుకుందాం!
డా. నాగసూరి వేణుగోపాల్
9440732392