సంవత్సరం క్రితం తెలంగాణ ఎన్నికల ముందు కూడా హైదరాబాదులో న్యూస్ ఛానళ్ళు చాలా స్దబ్దుగా ఉండేవి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో అభ్యర్థులను పెట్టడంలో ఎంత లాభ పడ్డాడో, నష్టపోయాడో మనకు తెలియదు కానీ తెలంగాణ మీడియాలో మాత్రం హడావుడి పుంజుకుంది. వ్యంగ్యం, హాస్యం, వెటకారం అసలు లేకుండా బుద్ధిగా సాగేవి హైదరాబాదు టీవీ ఛానళ్ళు. ఆధారరహితమైన వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా ఊరుకునేది లేదని జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అధిరోహిస్తూ స్పష్టం చేశారు. ఆ సమయంలో ఈటీవీ, ఎబిఎన్, టీవీ-5 ఛానళ్ల పేర్లు కూడా ప్రస్తావించారు. నిజానికి అంతవరకు టీవీ-9, ఎన్ టీవీ కూడా జగన్ వ్యతిరేక ధోరణి పాటించాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారికి అంతర్గత వ్యవహారాలు తెలిసి ఉంటాయి కనుక వారు ఈ రెండు ఛానళ్ళను పేర్కొనలేదు. ఇప్పుడు ఈ రెండు ఛానళ్ళు కాస్త న్యూట్రల్ గా సాగుతున్నాయి.
టీవీ-5, ఏబిఎన్ ఛానళ్ళు ఆంధ్రప్రదేశ్ వార్తలంటే జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలనే పద్ధతిలో సాగుతున్నాయి. ముఖ్యాంశాలలో టోన్ గానీ; ఎంచుకునే వార్తాంశాలలో మొగ్గుగానీ; చర్చకు నిలిపే అంశాలు గానీ ఇదే బాణీలో కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వివిధ నియోజక వర్గాలలో ఎన్ టీవీ, టీవీ-9 నిర్వహించిన చర్చా కార్యక్రమాలలో చెప్పాలనుకున్న విషయాలను తమకు కావాల్సిన రీతిలో ప్రకటించాయి. ప్రభుత్వంపట్ల మొగ్గు స్పష్టంగా కనిపించేది. ఇప్పుడది మాయమైంది. కేవలం మూడు ఛానళ్ళలో మాత్రమే ధోరణి విభిన్నంగా ఉంది. ఈటీవీ న్యూస్ ఛానళ్ళు రెండూ ఎగిరి పడవు గానీ టీఆర్పీల కోసం ఎగదోసే రీతిలో అంశాలనూ, వక్తలను ఎంపిక చేసుకుని అదే రీతిలో చర్చ నడిపిస్తాయి. గత వారంలో ఒక వీడియో ఫేస్ బుక్లో, వాట్సాప్లో గిరికీలు కొట్టింది. ఒక న్యూస్ ఛానల్లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరూ మాటామాటా పెరిగి కొట్టుకుంటారు. యాంకర్ కొమ్మినేని కూడా ఏమీ చేయలేకపోతారు. నిజానికి దీన్ని చూసినవారు కొమ్మినేని కొత్త ఛానల్కు వెళ్ళారా? కొట్టుకున్న వాళ్ళు ఎవరు అని అన్వేషించారు. నెమ్మదిగా తెల్సింది ఏమంటే అది పాత వీడియో అని. దీనిని ఎందుకు, ఏ ఉద్దేశంతో ఎవరు షేర్ చేశారో తెలియదు గానీ – ఇప్పుడు జరిగింది అన్నట్టు అందరూ నమ్మే పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో టీవీ ఛానళ్ళు గౌరవాన్ని తెచ్చుకున్నాయి.
ఇటీవల రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా? న్యూస్ ఛానళ్ళ చర్చలకు తమ పార్టీ అధికార ప్రతినిధులను పంపకూడదని. ఇలాంటి ధోరణి తమిళనాట చాలాకాలంగా ఉంది. తెలుగులో కూడా కొన్ని ఛానళ్ళ వారు కొన్ని పార్టీలను ఆహ్వానించడం లేదు. క్రమంగా తెలుగు ప్రాంతాలతో పాటు దేశం మొత్తం ఇలాంటి పరిస్థితికి వెడుతోంది. విభేదించే అభిప్రాయం ఉన్నవారిని భరించలేని స్థితి వస్తోంది. ఇపుడు పార్టీలు టీవీ ఛానళ్ళ స్టూడియోల ద్వారా, చర్చా కార్యక్రమాలద్వారా రాజకీయాలు నడుపుతున్నాయనే విమర్శ బిగ్గరగానే వినబడుతోంది. అదే విధంగా రాజకీయ నాయకులు మీడియా యాజమాన్యంలో ప్రవేశిస్తుండగా; జర్నలిజంలోని ప్రముఖులు పార్టీలకూ, ప్రభుత్వాలకూ చేరువ కావడమే కాక – అందులో భాగస్వాములవుతున్నారు. దానికి తాజా తార్కాణం – హైదరాబాదులో ఇటీవల న్యూస్ ఛానళ్ళ వ్యాపారంలోకి దిగిన మై హోం, మేఘా ఇంజినీరింగ్ కంపెనీలు ఆదాయపు శాఖ దాడులకు గురికాగా; ఈ రెండు సంస్థలపై తీవ్ర ఆరోపణలతో విమర్శలు చేసిన జర్నలిస్టు రవిప్రకాష్ కేసుల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు.
డా. నాగసూరి వేణుగోపాల్