జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలతో అమరనాథ్ గుహ వద్ద ఆకస్మికంగా వరదలు పొటెత్తాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఊహించని రీతిలో కొండలపై నుండి ఒక్కసారిగా వరద నీరు దూసుకువచ్చింది. వరద గుహకు సమీపంలోని యాత్రికుల టెంట్లకు చుట్టుముట్టింది. అనేక టెంట్లు కొట్టుకుపోయాయి. ఊహించని ఈ పరిణామానికి భక్తులు భయభ్రాంతులకు గురైయ్యారు. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మరో 40 మందికి పైగా గల్లంతు అయినట్లు అధికారులు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ అధికారులు యాత్రను నిలిపివేశారు. వరదల సమాచారం అందుకున్న ఎన్ డీ ఆర్ ఎఫ్, ఎస్ డీ ఆర్ ఎఫ్, ఐటీబీసీ సహా ఇతర సంస్థలు కలిసి యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. హెలికాఫ్టర్ లను కూడా రంగంలోకి దించాయి.
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ఘటనపై స్పందిస్తూ పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా లకు వివరించినట్లు చెప్పారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ప్రతినిధి మాట్లాడుతూ రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిని ఆర్మీ హెలికాఫ్టర్ లలో ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గుహ ప్రాంతం ముంపునకు గురికావడంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. వరద తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటే రేపు యాత్రను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఘటన పట్ల ప్రధాన మంత్రి మోడీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లు దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.
రెండేళ్లు కోవిడ్ విరామం తర్వాత ఈ ఏడాది జూన్ 30న అమరనాథ్ తీర్థయాత్ర ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు లక్ష మంది యాత్రికులు మందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.