China Marathon: చైనాలో నిర్వహించిన మారథాన్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం వల్ల వంద కిలో మీటర్ల మౌంటెన్ రేసులో పాల్గొన్న వారిలో 21 మంది మృత్యువాత పడ్డారు. ఈ మారథాన్ లో మొత్తం 172 మంది పాల్గొన్నారనీ, వారిలో 151 మంది సురక్షితంగా బయటపడినట్లు చైనా మీడియా తెలిపింది. చైనాలో గాన్సు ప్రావిన్సుకు చెందిన బయర్ నగరంలోని ఒక పర్యాటక ప్రదేశంలో వంద కిలో మీటర్ల పర్వత మారథాన్ ఏర్పాటు చేశారు. ఈ మారథాన్ సాగే ప్రాంతం మొత్తం దాదాపు నదీ తీర అటవీ ప్రాంతంలోనే ఉంది. ఈ మారథన్ లో పాల్గొన్న రన్నర్లకు 20 నుండి 31 కిలో మీటర్ల మధ్య చేరుకోగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రతికూల వాతావరణం ఎదురైంది.
ఒక్కసారిగా భీకర చలిగాలులతో వడగళ్లు, మంచు వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో కొందరు రన్నర్లు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. కొందరు రన్నర్లు సమీప రెస్క్యూ కేంద్రాలకు సహాయం కోసం సమాచారం ఇచ్చారు. సహాయ సిబ్బంది అక్కడకు చేరుకుని పలువురిని రక్షించారు. అప్పటికే 21 మంది మృత్యువాత పడ్డారు. మరో ఎనిమిది మంది స్వల్ప అస్వస్థతతో కోలుకుంటున్నారు.