భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును డిల్లీ పోలీసులు రట్టు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుదల వేళ భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలను తరలిస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని తీసుకున్న ఢిల్లీ పోలీసులు వారి వద్ద నుండి భారీగా మందుగుండు సామాగ్రి, రెండు వేల కాట్రిడ్జ్ (తూటా)లను స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్ విహార్ లో రెండు సంచుల తూటాలతో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత్ సిద్దమవుతున్న వేళ భారీ విధ్వంసానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఐబీ హెచ్చరిక నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మార్కెట్ లతో సహా ఢిల్లీలోని పలు ప్రదేశాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్స్, పార్కింగ్ స్థలాలు, రెస్టారెంట్లు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎర్రకోట, వేదిక వైపు వెళ్లే మార్గాల్లో పదివేలకు పైగా పోలీసులు వివిధ ప్రాంతాల్లో మోహరించారు.