Breaking: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. ప్రైవేటు బస్సు, ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ధౌరేహ్రా నుండి లక్నో వెళుతున్న బస్సు ఇసానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎరా వంతెన సమీపంలో ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికిపైగా ప్రయాణీకులు ఉన్నారు. ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 25 మందికిపైగా గాయపడ్డారు.
క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రాధమిక చికిత్స అనంతరం లక్నో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో జిల్లా అధికార యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాద ఘటనపై సీఎం యోగి అదిత్యనాథ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం యోగి ఆకాంక్షించారు.