Supreme Court: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఈ నెల 8వ తేదీ మంగళవారం (రేపు) పదవీ విరమణ చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే రేపు గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీం కోర్టుకు సెలవు దినం కావడంతో ఈ రోజే (సోమవారం) సీజే జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం చివరి విచారణ జరపనుంది. చివరి సారి విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
పదవీ విరమణ అవుతున్న ప్రధాన న్యాయమూర్తి చివరి విచారణను తమ వారసుడితో కలిసి చేపట్టడం సుప్రీం కోర్టులో ఆనవాయితీ. ఈ క్రమంలో జస్టిస్ లలిత్, కాబోయే సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఇవేళ జరిపే లాంఛన విచారణను తమ వెబ్ సైట్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది.
ఈ రోజు సుప్రీం కోర్టు ఓ కీలక అంశంపై తీర్పు ఇవ్వనున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఆర్దికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం ఇవేళ తీర్పు వెల్లడించనుంది. ఆగస్టు 26న సీజేఐ గా పదవీ విరమణ అయిన జస్టిస్ ఎన్ వీ రమణ చివరి రోజు చేపట్టిన విచారణ ను తొలిసారిగా సుప్రీం కోర్టు లైవ్ స్టీమ్ చేసింది. అదే విధంగా ఈ రోజు సీ జే ఐ లలిత్ పదవీ విరమణకు ముందు చివరి విచారణ కూడా ప్రత్యక్ష ప్రసారం కానున్నది.