ఢిల్లీలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) .. ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గురజాత్ పై పూర్తి దృష్టి సారించింది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇస్తున్న ఉచిత హామీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జాతీయ పార్టీ బీజేపీకి ఇబ్బందిగా మారుతోంది. అందుకే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజకీయాల కోసం ఉచిత హామీలను అమలు చేయడం ప్రగతికి నిరోధకాలు అంటూ వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం కోసం ఉచిత హామీలను ఇస్తూనే ఉంటారు. కానీ జాతీయ పార్టీలకు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఇబ్బంది. ఒక రాష్ట్రానికే ఉచిత హామీలను ఇవ్వలేదు. ఏ నిర్ణయాన్ని ప్రకటించినా అది దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సి ఉంటుంది.
ఇది గమనించిన ఆప్ అధినేత కేజ్రీవాల్.. గుజరాత్ లో ఓటర్లను ఆకర్షించి జెండా పాతేందుకు కీలక హామీలను ఇస్తున్నారు. ఇప్పటికే గుజరాత్ ప్రజలకు ఉచిత నీరు, ఉచిత విద్యుత్, ఢిల్లీ మోడల్ విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. నిరుద్యోగులను ఆకర్షించేందుకు తాజాగా హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పాటు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతిని ఇస్తామని ప్రకటించారు. అయిదేళ్లలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాన్ని కల్పించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు అరవింద్ కేజ్రీవాల్. గిర్ సోమ్ నాథ్ జిల్లాలోని వెరావల్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఈ మేరకు హామీలను ఇచ్చారు.
గుజరాత్ రాష్ట్రానికి రూ.3.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్న కేజ్రీవాల్.. రాష్ట్రంలో ఇక్కడి ప్రభుత్వం ఏదైనా ఉచితంగా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వనప్పుడు ఇన్నిలక్షల కోట్ల అప్పులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. కేవలం అవినీతి వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని కేజ్రీవాల్ విమర్శించారు. 27 సంవత్సరాలుగా గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ తరుణంలో గుజరాత్ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ఎటువంటి హామీలు ఇస్తుందో వేచి చూడాలి.