above 100 years recovered pandemic: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజల్లో అనేక భయాందోళనలు కలుగుతున్నాయి. అయితే ఆత్మవిశ్వాసం ఉంటే ఈ మహమ్మారిని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు వైద్యులు. ప్రధానంగా కరోనా మహమ్మారి బారిన లక్షలాది మంది పడుతున్నా అదే స్థాయిలో రికవరీలు ఉంటున్నాయి. మరణాల శాతం చాలా తక్కువ. అయితే ఎక్కువ శాతం మంది భయాందోళనల వల్ల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. అదే వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆత్మ విశ్వాసం, ధైర్యంతో ఉంటే ఎటువంటి రుగ్మతలనైనా ఎదుర్కొనవచ్చు. ఇటీవల ఇద్దరు శతాధిక వృద్ధులు కరోనాతో పోరాడి విజయం సాధించారు.
వివరాల్లోకి వెళితే…హైదరాబాద్ కీసర గుట్టలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న రామానంద తీర్థ వయస్సు 110 సంవత్సరాలు. ఇటీవల ఆయన కరోనా బారిన పడటంతో ఆశ్రమ నిర్వహకులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. వృద్ధాప్యం కారణంగా ఆయన తన వివరాలు కూడా సరిగా చెప్పలేకపోయారు. ఆశ్రమ నిర్వహకుల వద్ద కూడా ఆయనకు సంబంధించిన వివరాలు లేవు. అయితే 18 రోజుల చికిత్స అనంతరం ఆయన పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి సూపర్నిటెండెంట్ ఎం రాజారావు తెలిపారు. కరోనా నుండి కోలుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడే వరకూ ఆసుపత్రిలోనే ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు.
అదే విధంగా బెంగుళూరుకు చెందిన ఓ స్వాతంత్ర్య సమరయోధుడు కరోనాను జయించారు. హెచ్ ఎస్ దొరస్వామి వయస్సు 104 సంవత్సరాలు. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ రిపోర్టు వచ్చింది. చికిత్స సమయంలో ఆయన ఆత్మ విశ్వాసంతో కనిపించారనీ, అందుకే మందులు ఆయనపై బాగా పని చేశాయి అంటున్నారు వైద్యులు. సరైన జాగ్రత్తలు పాటిస్తూ భయాందోళనకు గురి కాకుండా చికిత్స చేయించుకుంటే కరోనాను జయించడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ శతాధిక వృద్ధులకు దీర్ఘకాల జబ్బులు ఏమి లేకపోవడం గమనార్హం.