ఆదానీ – హిండెన్ బర్గ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఆదానీ వివాదంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పెట్టుబడిదారుల భద్రతను నిర్దారించేందుకు కమిటీ వేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సెబీ చూస్తొందని కోర్టుకు తెలియజేశారు. ఆదానీ సంస్థల్లో స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ వంటివి జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలైయ్యాయి. సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు.
ఈ పిటిషన్ల పై ఇంతకు ముందు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు.. కమిటీ ఏర్పాటుపై కేంద్రం స్పందన కోరింది. ఈ క్రమంలో సోమవారం విచారణ జరగ్గా కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. కమిటీ సభ్యులు, పరిధి, విచారణాంశాలను సీల్డ్ కవర్ లోనే కోర్టుకు అందజేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఆదానీ గ్రూప్ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుందని ఏజీ పేర్కొన్నారు. అందుకే కమిటీ పరిధి, విచారణాంశాలను బుధవారం సీల్డ్ కవర్ లోనే ఇస్తామని ఏజీ తుషార్ మెహతా తెలిపారు. హిండెన్ బర్గ్ అంశంపై విచారించే శక్తి సామర్థ్యాలు సెబీ దగ్గర ఉన్నాయని ఏజీ తుషార్ మెహతా పేర్కొన్నారు. కమిటీ సభ్యులు, కమిటీ పరిధి, విచారణాంశాలు అందిన తర్వాత తీర్పు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీ శుక్రవారంకు వాయిదా వేసింది.
ఆగని విపక్షాల ఆందోళన ..మార్చి 13కు రాజ్యసభ వాయిదా