AIIMS chief Randeep Guleria: కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న తరుణంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా మరో కీలక విషయాలను వెల్లడించారు. కరోనా వైరస్ కనుక ఇలానే చెలరేగుతూ రోగ నిరోధక శక్తి నుండి తప్పించుకునేలా అభివృద్ధి చెందితే దేశంలో థర్డ్ వేవ్ ను కూడా చూడాల్సి వస్తుందని అన్నారు. అయితే కరోనా వైరస్ థర్డ్ వేవ్ నాటికి చాలా మందికి వ్యాక్సిన్ లు అందే ఉండటం వల్ల ప్రస్తుతం ఉన్నంత తీవ్రత థర్డ్ వేవ్ లో ఉండకపోవచ్చని అంచనా వేశారు. కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ప్రస్తుతం వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని అన్నారు. వైరస్ లో మార్పులు చోటుచేసుకుంటుండటం కూడా ఇందుకు ఒక కారణం అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
కరోనా కట్టడికి పలు రాష్ట్రాల్లో నైటే కర్ప్యూలు, వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు నిర్ణీత కాలం పాటు లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందని డాక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. కనీసం రెండు వారాల పాటు కఠినంగా లాక్ డౌన్ విధించినట్లైయితే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వైరస్ చైన్ ను తెగ్గొట్టాలంటే ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయన్నారు. అందులో మొదటిది ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, రెండవది యుద్ధ ప్రాతిపదికన కరోనా కేసులు తగ్గించడం, మూడవది వ్యాక్సినేషన్ అని ఆయన పేర్కొన్నారు. మనుషుల మధ్య కాంటాక్ట్ ను తగ్గించగలిగితే కేసులు దిగి వస్తాయనీ, దానినే లాక్ డౌన్ అంటామని ఆయన పేర్కొన్నారు. ఒక వేళ లాక్ డౌన్ అమలు చేస్తే గనుక బ్రిటన్ తరహాలో కఠినంగా అమలు జరగాలన్నారు. అయితే లాక్ డౌన్ ఎలా ఉండాలనేది ఆయా రాష్ట్రాలు అక్కడి పరిస్థితులను బట్టి ఆలోచించుకోవాల్సి ఉంటుందన్నారు.