AIIMS Chief Randeep guleria: వివిధ రాష్ట్రాలు కోవిడ్ మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ నెలలో మధ్యప్రదేశ్ లో శ్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియలు, ప్రభుత్వం వెల్లడించిన అధికారిక లెక్కలకు పొంతన లేదని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ తరణంలో రణ్ దీప్ కోవిడ్ ఓ మీడియాతో మాట్లాడిన సందర్భంగా కోవిడ్ మరణాలపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కరోనా సంబంధిత మరణాలను ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా గుర్తించని పక్షంలో మహమ్మారి కట్టడికి చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఓ వ్యక్తి గుండె పోటుతో మరణించిన తరువాత కోవిడ్ ఉన్నట్లు తేలితే ఆయన కరోనా వల్లే గుండె పోటు వచ్చి ఉండవచ్చని అన్నారు. దీన్ని కోవిడ్ మరణాల కింద కాకుండా గుండెపోటు వల్ల సంభవించిన మరణంగా లెక్కగట్టవచ్చని అన్నారు. కోవిడ్ సంబంధిత సమాచారాన్ని చేసుకోవడంలో పొరపాట్లు జరిగి మహమ్మారి కట్టడి వ్యూహాలు విఫలమయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు మరణాల తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని గులేరియా సూచించారు. దీంతో పక్కా సమాచారం అందుబాటులోకి వచ్చి సరైన వ్యూహాలు రచించేందుకు దోహదం చేస్తుందన్నారు. ప్రజల వ్యవహారాల శైలి, వైరస్ రూపాంతరాలే పలు సార్లు విజృంభణకు కారణమని గులేరియా అన్నారు.
ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే వ్యాక్సిన్లు తీవ్ర స్థాయి కరోనా బారిన పడకుండా రక్షిస్తున్నాయని తెలిపారు. మొదటి, రెండవ డోసుల మధ్య 12 -13 వారాల వ్యవధి సరైనదేనని అన్నారు. కొత్త సమాచారం అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ వ్యవధి మార్చే అవకాశం ఉందన్నారు.