AIIMS chief Randeep Guleria: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటి ఆంక్షలను అమలు చేయడంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తున్నది. తాజాగా నమోదు అవుతున్న కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నాయి. దీంతో సాధారణ జనజీవనానికి ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ప్రజలు మళ్లీ యథావిధిగా రోడ్లపైకి, మార్కెట్ లోకి వచ్చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రద్దీ పెరుగుతోంది. మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితులపై ఢిల్లీ ఎయమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ జాతీయ మీడీయా ఛానల్ తో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More: Big Breaking: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత
ప్రజలు కరోనా కట్టడి నిబంధనలను విస్మరిస్తే కరోనా మూడవ దశ అనివార్యమని హెచ్చరించారు గులేరియా. పరిస్థితులు ఇలానే కొనసాగితే నెలన్నర నుండి రెండు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ విజృంభణ ప్రారంభం అవుతుందని అంచనా వేశారు. మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే ఆయుధమని ఆయన పునురుద్ఘాటించారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసే క్రమంలో భాగంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచడం తప్పుడు విధానం కాదని పేర్కొన్నారు.
కరోనా కట్టడికి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తూ..హాట్ స్పాట్ లపై గట్టి నిఘా పెట్టడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని తెలిపారు. లేకపోతే వైరస్ వ్యాప్తి పెరిగి కొత్త మ్యూటేషన్లు వస్తాయని గులేరియా హెచ్చరించారు. కొత్త వేరియంట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ పై ఇంకా అధ్యయనం జరగాల్సిన ఉందని చెప్పారు.