పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుండి జరగనున్నాయి. ఈ నెల 29 వరకూ జరగనున్న ఈ సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయంగా కనబడుతోంది. ఉభయ సభలు మొత్తం 17 రోజుల పాటు సమావేశం కానుండగా, కేంద్ర ప్రభుత్వం 17 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా ఇవేళ (మంగళవారం) కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టే 17 బిల్లులలో బోయలాజికల్ డైవర్సిటీ, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటిలు, అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఈ మూడు బిల్లులను స్థాయి సంఘం పరిశీలనకు పంపాలని వాటిపై మరింత విస్తృతంగా చర్చ జరగాలని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
దేశ ఆర్ధిక పరిస్థితి, రాజ్యాంగ సంస్థలను బలహీనపర్చడం, సరిహద్దు ల్లో చైనా దురాక్రమణలు, ఈడబ్ల్యుఎస్ కోటా రిజర్వేషన్ అంశాలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, రూపాయి మారకపు విలువ పతనం, ఎగుమతుల తగ్గుదల, ఇండో – చైనా సరిహద్దు సమస్య, అధిక జీఎస్టీ పన్నుల అంశాల ను కూడా ప్రస్తావిస్తామని కాంగ్రెస్, టీఎంసీ, ఇతర విపక్షాల నేతలు తెలిపారు. విపక్షాలు ప్రస్తావించే అంశాలపై చర్చకు సిద్దంగా ఉన్నట్లు అఖిలపక్ష భేటీ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు.
వైసీపీ తరపున ఎంపీ మార్గాని భరత్ ఈ సమావేశానికి హాజరైయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విభజన చట్టం పెండింగ్ అంశాలే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతున్నామని ఆయన తెలిపారు.