భారీ వర్షాలు మళ్లీ మొదలు కావడంతో అమరనాథ్ యాత్రకు మరో సారి నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్ముకశ్మీర్ లోని పహల్గాం, బల్తాల్ మార్గంలో యాత్రికులు వెళ్లేందుకు అక్కడి సిబ్బంది అనుమతించడం లేదు. వర్షాలు తగ్గే వరకూ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) అధికారులు సమాచారం ఇచ్చినట్లు అక్కడి సిబ్బంది పేర్కొన్నారు. అమరనాథ్ యాత్ర కొంత కాలం నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఐటీబీపీ వర్గాలు వెల్లడించాయి. పహల్గం, బల్తార్ మార్గాల ద్వారా వెళ్లే యాత్రికులను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వర్షాలు తగ్గిన తరువాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కరోనా కారణంగా రెండేళ్ల విరామం తరువాత గత నెల 30వ తేదీన ఈ ఏడాది అమరనాథ్ యాత్ర ప్రారంభమైంది. ఆ రోజునే పహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లో తొలి యాత్రికుల బృందాలు అమరనాథ్ యాత్రకు పయనమయ్యారు. అయితే కొద్ది రోజుల్లోనే జూలై 5న తొలి సారి అధిక వర్షాల కారణంగా యాత్ర నిలిచిపోయింది. తర్వాత అకస్మాత్తుగా వరదలతో 8వ తేదీన మరో సారి యాత్రను తాత్కాలికంగా ఆపేశారు. అక్కడి వరదల్లో దాదాపు 15 మంది మృతి చెందగా 40 మందికిపైగా గల్లంతు అయ్యారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
ఆ తరువాత యాత్ర ప్రారంభమైనా .. ఇప్పుడు మరో సారి ఆగిపోయింది. ఇప్పటి వరకూ మొత్తం 1.44 లక్షల మంది భక్తులు అమరనాథ్ లింగాన్ని దర్శించుకున్నట్లు దేవస్థానం బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం 16,457 మంది భక్తులు అమరనాథ్ యాత్ర మార్గంలో ఉన్నారనీ, మరో 5,449 మంది జమ్ములోని బేస్ క్యాంపు నుండి బుధవారమే బయలుదేరారని తెలిపింది. వీరంతా ఎక్కడికక్కడ ఆగిపోయినట్లు వెల్లడించింది.